తమ తోటి నటులు హిట్ల మీద హిట్లు కొడుతుంటే సంతోషించే హీరోలు, హీరోయిన్లు తక్కువమందే ఉంటారు. తమతో కలిసి ప్రయాణం మొదలు పెట్టిన వాళ్లే అయినా.. తమను మించి ఎదిగిపోతుంటే అసూయ లేకుండా వారిని అభినందించేవాళ్లు అరుదుగా ఉంటారు. మలయాళ భామ అనస్వర రాజన్ ఈ అరుదైన జాబితాలోనే నిలుస్తుంది. తన తోటి మలయాళ కథానాయిక మమిత బైజుకు వరుస బ్లాక్ బస్టర్లు పడడం పట్ల ఆమె అమితానందం వ్యక్తం చేసింది.
మమిత ఇటీవల 40 రోజుల వ్యవధిలో మూడు రూ.200 కోట్ల సినిమాలను ఖాతాలో వేసుకుంది. జననాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహాం కుడుంబ యూనిట్.. ఈ మూడు చిత్రాలూ రూ.200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టాయి. ఈ మూడు చిత్రాల వసూళ్లు కలిపితే రూ.800 కోట్ల కంటే ఎక్కువ కావడం విశేషం. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, ఆలియా భట్ తర్వాత మూడు రూ.200 కోట్ల సినిమాలను కలిగి ఉన్న కథానాయిక మామిత మాత్రమే.
ఇదే విషయాన్ని ఓ ప్రెస్ మీట్లో అనస్వర దగ్గర ప్రస్తావిస్తే.. ఆమె అమితానందాన్ని వ్యక్తం చేసింది. మమితకు వరుసగా ఇలాంటి విజయాలు దక్కుతుండడం తనకు చాలా సంతోషాన్నిస్తోందని.. ఇంత మంచి సినిమాల్లో ఆమె భాగం కావడం ఎంతో మంచి విషయమని.. మమితకు తాను ఎప్పుడూ మద్దతుగా ఉంటానని.. ఆమె కూడా తనకు అంతే సపోర్ట్ ఇస్తుందని అనస్వర చెప్పింది. వీళ్లిద్దరి అనుబంధాన్ని చూస్తే హీరోయిన్లు అంటే ఇలా ఉండాలి అనే ఫీలింగ్ రాకమానదు.
మమిత, అనస్వర ఇద్దరిదీ ఒకే వయసు. ఇద్దరూ దాదాపుగా ఒకే టైంలో కెరీర్ ఆరంభించారు. ఇద్దరూ కలిసి సూపర్ శరణ్య, ప్రణయ విలాసం అనే సినిమాల్లోనూ నటించారు. వీరి మధ్య ప్రొఫెషనల్గా పోటీ ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో ఒకరికి ఒకరు సపోర్ట్గా నిలుస్తుంటామని అనస్వర చెప్పింది. ఈ ఇద్దరూ ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్లుగా మారడం విశేషం. అనస్వర ప్రస్తుతం టాలీవుడ్లో ‘అంతా రాములోరు చూస్కుంటారు’; ‘ఇట్లు అర్జున’, ‘కాకా’ చిత్రాల్లో నటిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates