ఈ రోజుల్లో ఏదైనా పెద్ద సినిమా మొదట ప్రకటించిన డేటుకు రిలీజైతే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటోంది. ఎంత ప్రణాళికాబద్ధంగా షూటింగ్ చేసినా సరే.. సినిమాలు ఆలస్యం అయిపోతున్నాయి. షూట్ సమయానికి పూర్తి చేసినా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల అయినా వాయిదా అనివార్యం అవుతోంది. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాల్లో ఒకటైన ఆదర్శ కుటుంబం-ఏకే 47 కూడా వాయిదా పడబోతోందని ఇటీవల జోరుగా వార్తలు వచ్చాయి.
షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కష్టమని.. ఒకటి లేదా రెండు వారాలు ఆలస్యంగా సినిమా రిలీజవుతుందని సోషల్ మీడియాలో, మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. మేకర్స్ కూడా ఈ వార్తలను ఖండించకుండా మౌనం వహించడంతో వాయిదా అనివార్యం అని అంతా ఫిక్సయిపోయారు.
ఇలాంటి టైంలో ఆదర్శ కుటుంబం సహ నిర్మాత సూర్యదేవర నాగవంశీ లైన్లోకి వచ్చాడు. ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 2నే ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించాడు. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తమకు తెలుసని.. విడుదలకు నెల రోజులే సమయం ఉంది కాబట్టి, ఇకపై వరుసగా క్రేజీ అప్డేట్స్ ఇస్తామని నాగవంశీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నాడు.
నాగవంశీ క్యాజువల్గా ఈ పోస్టు పెట్టినట్లున్నా.. వార్తలకు ఇది ఖండనలాగే ఉంది. ఆదర్శ కుటుంబం వాయిదా పడుతుందన్న అంచనాతో వేరే సినిమాల రిలీజ్ ప్లానింగ్ కూడా మారుతుండగా.. నాగవంశీ అందరికీ షాకిచ్చాడు. ఈ సినిమా చెప్పిన డేటుకే వచ్చేట్లయితే సెప్టెంబరు 24 నుంచి ది ప్యారడైజ్ను వాయిదా వేయడం కూడా కష్టమే. త్రివిక్రమ్, వెంకటేష్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. తమన్ సంగీతం అందించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates