హిందీ నిర్మాతలు అత్యధిక శాతం ఎనిమిది వారాల ఓటిటి విండోని ఖచ్చితంగా పాటిస్తారు. అంటే థియేటర్ లో విడుదలైన యాభై రోజుల తర్వాత కానీ డిజిటల్ చూసే ఛాన్స్ ఉండదన్న మాట. దీనికి కారణం అక్కడి మల్టీప్లెక్సుల సమాఖ్య పెట్టుకున్న కఠిన నిర్ణయం. ఒకవేళ ఈ నిడివి ఎవరైనా మీరితే వాళ్లకు షోలు ఇవ్వరు. అందుకే మన బాలీవుడ్ డబ్బింగులు కొన్ని ఆలస్యంగా బుల్లితెరమీద వస్తాయి. అయితే సౌత్ లో ఈ సమస్య లేదు. చాలా తెలుగు తమిళ సినిమాలు 28 రోజులకే ఓటిటిలో వస్తాయి.
అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మన దగ్గర కూడా మల్టీప్లెక్సులు అలాంటి పద్దతి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవలే విడుదలైన ఒక మలయాళ మూవీ, ఒరిజినల్ వెర్షన్ రిలీజైన రెండు వారాల తర్వాత తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చారు. కానీ జాతీయ మల్టీప్లెక్సులు షోలు ఇవ్వడానికి నిరాకరించాయి. ఎందుకంటే ఇంకో పద్నాలుగు రోజుల్లో ఓటిటిలో వచ్చేస్తుంది కాబట్టి. దీంతో నిర్మాత ఏపీ తెలంగాణ సింగల్ స్క్రీన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏదైతే రెండు నెలల గ్యాప్ ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారో దాన్ని నార్త్ మల్టీప్లెక్సులుఎప్పటి నుంచో ఆచరణలో పెట్టి చూపించాయి. తమిళనాడులో కూడా ఇది రావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తూ ఇటీవలే సమ్మె సైరన్ మోగించిన సంగతి తెలిసిందే. కానీ ప్రాక్టికల్ గా చూస్తే మన దక్షిణాది వైపు ఇలాంటివి అమలు చేయడం కొంచెం కష్టమే. దానికి సహేతుకమైన కారణాలు లేకపోలేదు.
వందల కోట్లు వసూలు చేసిన ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, పుష్ప లాంటివి మన దగ్గర నాలుగు వారాలకు మించి ఆడిన దాఖలాలు తక్కువ. తెలుగు ఆడియన్స్ సినిమా చూడాలనుకుంటే ఆలస్యం చేయరు. వీలైనంత త్వరగా చూస్తారు. అందుకే మనకు షార్ట్ రన్ అలవాటు అయిపోయింది. కానీ హిందీలో అలా కాదు. వారాల తరబడి రన్ కొనసాగుతుంది. మార్కెట్ పెద్దది కాబట్టి వసూళ్లు నెమ్మదిగా ఉన్నా ఫైనల్ గ్రాస్ ఎక్కువ వస్తుంది. అందుకే ఇక్కడ బాలీవుడ్ స్ట్రాటజీలు అంత సులభంగా పని చేయవు.
Gulte Telugu Telugu Political and Movie News Updates