తెలంగాణలోని థియేటర్లను కొత్తగా వర్గీకరిస్తూ, వాటి టికెట్ల ధరలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో నంబర్.77 తెలుగు సినీ పరిశ్రమను ఆందోళనలోకి నెట్టినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా స్పెషల్ థియేటర్ల పేరుతో 7.1 సరౌండ్ సౌండ్ సిస్టమ్, 2కే-4కే ప్రొజెక్షన్ ఉన్న ప్రైమ్ సింగిల్ స్క్రీన్లను ఒక కేటగిరీ కిందికి తీసుకొచ్చి ఇందులో గరిష్టంగా రూ.300 టికెట్ల ధరలు పెట్టుకునే అవకాశం కల్పించడం నిర్మాతలను కలవరపెడుతోంది.
ఆల్రెడీ మల్టీప్లెక్సుల్లో అధిక రేట్లు ఉండడం పట్ల ప్రేక్షకుల్లో అసంతృప్తి ఉంది. వాటిలో సాధారణ సీట్లకు రూ.295, రిక్లైనర్లకు రూ.350 రేటు ఉంటోంది. కొత్త జీవోలో పేర్కొన్న దాని ప్రకారం ప్రైమ్ సింగిల్ స్క్రీన్లలో సాధారణ టికెట్లకు రూ.250 ప్లస్ జీఎస్టీ, రిక్లైనర్లకు రూ.300 ప్లస్ జీఎస్టీ రేటు పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు.
సింగిల్ స్క్రీన్లలో రేట్లు తక్కువ అని వాటిని ఎంచుకుంటున్న ప్రేక్షకులకు తాజా జీవో తీవ్ర నిరాశ కలిగించేదే. దీని వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మరింత తగ్గిపోతుందనే వాదన వినిపిస్తోంది. ఐతే ఇండస్ట్రీ నుంచి సింగిల్ స్క్రీన్ల టికెట్ల ధరలు పెంచాలనే డిమాండ్ లేకపోయినా.. ప్రభుత్వం ఇలా జీవో ఇవ్వడం పట్ల నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే జీవోను సవరించాలని విజ్ఞప్తి చేస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో తమ ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. సింగిల్ స్క్రీన్ల టికెట్ల ధరలు కొంత మేర పెంచినా ఓకే కానీ.. మరీ ఈ స్థాయిలో పెంపు ఉంటే దాని వల్ల థియేటర్ల మీద, ఇండస్ట్రీ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. అందుబాటులో టికెట్ల ధరలున్న సినిమాలను చూడడానికి జనం ఈ మధ్య బాగా థియేటర్లకు వస్తున్న తరుణంలో కొత్త జీవో పట్ల ప్రేక్షకుల్లోనే కాక, ఇండస్ట్రీలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates