అశ్వత్థామను ఆపేయడం మంచి పనే…

అశ్వత్థామ.. ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్, పైగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమా. షాహిద్ కపూర్ తన కెరీర్ కు అతిపెద్ద సినిమా అవుతుందని అనుకున్నాడు. కానీ అలాంటి ప్రాజెక్ట్ ఆగిపోతే ఎవరికైనా బాధ ఉండటం సహజమే. కానీ ఇప్పుడు నిర్మాత జాకీ భగ్నానీ చెప్పిన కారణం వింటే మాత్రం తొందరపడి సెట్స్‌పైకి వెళ్లకపోవడమే మంచిదైందేమో అనిపిస్తోంది. ఈ సినిమా ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని, వాటిలో ‘కల్కి 2898 ఏడీ’ రావడం కూడా ఒకటని ఆయన చెప్పాడు.

‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’ను 2024 మార్చిలో చాలా గ్రాండ్‌గా ప్రకటించారు. సచిన్ రవి దర్శకత్వంలో షాహిద్‌ను మహాభారతంలోని చిరంజీవి అశ్వత్థామగా చూపించాలనుకున్నారు. కథ మాత్రం ఇప్పటి కాలంలో నడిచేలా ప్లాన్ చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో తీసుకురావాలనే లెక్క కూడా ఉంది. అంటే షాహిద్ కెరీర్‌లోనే పెద్ద సినిమాల్లో ఒకటిగా మారే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ఇది.

అయితే అదే ఏడాది జూన్‌లో ‘కల్కి’ వచ్చింది. అమితాబ్ బచ్చన్ చేసిన అశ్వత్థామ పాత్ర సినిమాకే పెద్ద హైలైట్‌గా నిలిచింది. వృద్ధుడిగా కనిపించినా ప్రభాస్‌తో సమానంగా తలపడే యోధుడిగా నాగ్ అశ్విన్ ఆ క్యారెక్టర్‌ను భారీగా చూపించాడు. పైగా ఆ పాత్ర కథ అక్కడితో ముగియలేదు. ‘కల్కి 2’ షూటింగ్‌లో కూడా అమితాబ్ ఇప్పటికే పాల్గొన్నాడు. అంటే ప్రేక్షకుల మైండ్‌లో అశ్వత్థామకు ఒక బలమైన రూపం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇలాంటి టైమ్‌లో షాహిద్ సినిమాను మొదలుపెడితే పోలికలు తప్పేవి కాదు. భారీగా డబ్బు ఖర్చు చేసినా ప్రేక్షకుడు సినిమా చూడడని, కంటెంట్ కొత్తగా లేకపోతే ఆ ఖర్చంతా వృథా అవుతుందని జాకీ చెప్పాడు. పైగా అశ్వత్థామ పేరుతో భారీ సినిమా ఆగిపోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు ఆదిత్య ధర్, విక్కీ కౌశల్‌తో ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ ప్లాన్ చేశాడు. బడ్జెట్ లెక్కలు కుదరక ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు వెళ్లలేదు. 

ఇప్పుడు షాహిద్ సినిమా దగ్గర కూడా భారీ స్కేల్, ఖర్చు విషయంలో ఇబ్బందులు వచ్చినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు ‘కల్కి’తో కొత్తదనం అనే సమస్య కూడా చేరడం మరో హెచ్చరికే. అనౌన్స్ చేశాం కాబట్టి ఎలాగైనా సినిమా తీయాలనే పట్టుదల కంటే, సరైన సమయంలో ఆగిపోవడం కూడా నిర్మాత తీసుకునే మంచి నిర్ణయమే.