కనకరాజు సెన్సార్ కోసం జనసేన మంత్రి ఫోన్

‘కొరియన్ కనకరాజు’ మేకర్స్ రీసెంట్ గా వైజాగ్‌లో ఒక సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇక ఆ వేదిక మీద ఆయన సినిమా టీమ్‌ను అభినందిస్తూ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో, అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

సినిమా అంతా పూర్తయినా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేదాకా ఒక టెన్షన్ ఉంటుంది. సరిగ్గా ఈ కొరియన్ కనకరాజు సినిమా రిలీజ్‌కు ముందు కూడా సెన్సార్ బోర్డు నిబంధనల వల్ల టీమ్‌కు కాస్త ఇబ్బంది ఎదురైంది. ఆ సమయంలో విషయం తెలుసుకున్న మంత్రి నేరుగా రంగంలోకి దిగారు. తాను కేవలం ఒక్క ఫోన్ కాల్ చేసి ఆ సెన్సార్ ఇబ్బందులను వెంటనే క్లియర్ చేయించానని ఆయన స్వయంగా మైక్ పట్టుకుని చెప్పారు.

కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన తర్వాత రిలీజ్ టైమ్‌కి ఏ చిన్న బ్రేక్ పడినా నిర్మాతలు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. సెన్సార్ బోర్డు రూల్స్ ప్రకారం చిన్న విజువల్ తేడా వచ్చినా కట్స్ చెబుతారు లేదా సర్టిఫికెట్ ఇవ్వడం లేట్ చేస్తారు. కనకరాజు సినిమాకు కూడా అలాంటి పరిస్థితి రావడంతో సరిగ్గా ఆ టైమ్‌లో దుర్గేష్ ఒక్క ఫోన్ కాల్ చేసి ఆ సమస్యను పరిష్కరించడం సినిమా బయ్యర్లకు, నిర్మాతలకు చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చింది.

ఈ వ్యవహారం చూస్తుంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంత అనుకూలంగా ఉందో క్లియర్ గా అర్థమవుతోంది. గతంలో సినిమా వాళ్లు ప్రభుత్వాల దగ్గరకు వెళ్లి తమ కష్టాలు చెప్పుకోవడానికి, చిన్న టికెట్ రేట్ల ఇష్యూ సాల్వ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు నేరుగా సినిమాటోగ్రఫీ మంత్రే ఒక సక్సెస్ మీట్ కు గెస్ట్ గా వచ్చి అసలు విషయాన్ని క్లారిటీగా చెప్పారు.