నితిన్‍పై ‘అయ్యప్ప – కోషి’ దాడి!

సంక్రాంతి రష్‍లో ఎందుకని ‘రంగ్‍ దే’ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్‍ చేసారు. అందరికంటే ముందుగా మార్చి 26న రంగ్‍ దే విడుదల కానుందని డేట్‍ కూడా అనౌన్స్ చేసారు. కానీ అలా అయినా ‘రంగ్‍ దే’కు సోలో రిలీజ్‍ దక్కేట్టు లేదు. ఎందుకంటే ఆ డేట్‍కి రానా దగ్గుబాటి నటిస్తున్న ‘అరణ్య’ సినిమా విడుదల కానుంది. తెలుగు, హిందీతో పాటు పలు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని జనవరి నుంచి మార్చికి వాయిదా వేసారు. ఇదిలావుంటే మార్చి 26నే పవన్‍ కళ్యాణ్‍ సినిమా ‘వకీల్‍ సాబ్‍’ కూడా విడుదలయ్యే అవకాశం లేకపోలేదు.

సమ్మర్‍లో వచ్చే మొదటి భారీ సినిమాకు అడ్వాంటేజ్‍ వుంటుంది కనుక దిల్‍ రాజు అదే డేట్‍ పక్కా చేసుకోవచ్చు. విశేషం ఏమిటంటే పవన్‍, రానా కలిసి ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ రీమేక్‍ చేస్తున్నారు. ఆ చిత్ర నిర్మాత నాగవంశీనే ‘రంగ్‍ దే’ నిర్మాత కూడా. ఒకవేళ వకీల్‍ సాబ్‍, అరణ్య మార్చి 26నే వస్తే రంగ్‍ దే రిలీజ్‍ డేట్‍ వాయిదా వేసుకునే అవకాశాలెక్కువ. పవన్‍ వీరాభిమాని అయిన నితిన్‍ చూస్తూ చూస్తూ తన ఫేవరెట్‍ హీరో సినిమాతో పోటీకి వెళ్లలేడుగా!