ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అన్నపుడు వ్యతిరేకించిన అభిమానులే.. రిలీజ్ ముంగిట ఈ సినిమాను తమ భుజాల మీద మోశారు. ఆసక్తికర ప్రమోషనల్ కంటెంట్కు తోడు.. దర్శకుడు మారుతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, మిగతా టీం సభ్యులు ఈ సినిమా గురించి ఒక రేంజిలో ఎలివేషన్ ఇవ్వడంతో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
కానీ ఈ సంక్రాంతికి విడుదలైన రాజాసాబ్ అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది. ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. రిలీజ్ తర్వాత దర్శకుడు మారుతిని ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా టార్గెట్ చేశారో తెలిసిందే. ఇప్పటికీ తనపై ఎటాక్ కొనసాగుతూనే ఉంది. మారుతి మిత్రుడు ఎస్కేఎన్ కూడా సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నాడప్పట్లో.
ఇప్పుడు ఎస్కేఎన్ నిర్మాతగా చెన్నై లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మీడియా వాళ్లు రాజాసాబ్ ఫలితం గురించి అడిగితే.. ఆ సినిమా ఫలితంతో తనకేం సంబంధం అన్నట్లు మాట్లాడాడు ఎస్కేఎన్.
రాజాసాబ్ ఫలితం గురించి ఆ సినిమా దర్శకుడు, నిర్మాత, హీరోలను అడగాలని, వాళ్లే ఎక్కువగా సినిమాతో ఎటాచ్ అయి ఉంటారని.. అంతే తప్ప ఆ సినిమాలో చిన్న భాగం అయినందుకు దాని గురించి తాను మాట్లాడడం పద్ధతి కాదని ఎస్కేఎన్ స్పష్టం చేశాడు. సినిమా ప్రమోషన్ల టైంలో ఏదైనా మాట్లాడొచ్చని.. కానీ అది చివరికి హీరో, డైరెక్టర్, నిర్మాతల ప్రాజెక్టు అవుతుందని, తనకు ఆ సినిమా ఫలితంతో సంబంధం లేదని ఎస్కేఎన్ అన్నాడు.
ఐతే సినిమా మొదలైన దగ్గర్నుంచి రిలీజ్ వరకు రాజాసాబ్కు ఎస్కేఎన్ మామూలు హైప్ ఇవ్వలేదు. ప్రమోషనల్ ఈవెంట్లలో బాగా హడావుడి చేశాడు. అందుకే ప్రభాస్ అభిమానులు రిలీజ్ తర్వాత మారుతితో పాటు అతణ్నీ టార్గెట్ చేశారు. మరి ఎస్కేఎన్ లేటెస్ట్ కామెంట్పై వాళ్లెలా స్పందిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates