తమిళంలో టీనేజీలోనే సంగీత దర్శకులుగా చాలా పెద్ద స్థాయికి ఎదిగిపోయారు జీవీ ప్రకాష్ కుమార్, అనిరుధ్ రవిచందర్. ఈ ఇద్దరిలో అనిరుధ్ అయితే ఆరంభం నుంచి సంచలనాల మోత మోగిస్తూ సాగిపోతున్నాడు. తొలి చిత్రం ‘3’తోనే అతను ప్రకంపనలు రేపాడు. ఆ తర్వాత సినిమా సినిమాకు ఇంతింతై అన్నట్లుగా ఎలా ఎదిగిపోయాడో తెలిసిందే.
ప్రస్తుతం ఇండియా మొత్తంలో సంగీత దర్శకుడిగా అతడికున్నంత క్రేజ్ ఇంకెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. అనిరుధ్ను కొట్టే మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పట్లో రాడు అన్న అభిప్రాయం కలిగింది అందరికీ. కానీ సాయి అభ్యంకర్ అనే కుర్రాడు అనిరుధ్ను మించిపోయేలా కనిపిస్తున్నాడు. 20 ఏళ్లు నిండకముందే అతను తమిళంలో అనిరుధ్కు పోటీ ఇచ్చే స్థాయిలో పెద్ద రేంజికి ఎదిగిపోయాడు.
ఇప్పటికే డ్యూడ్, కరుప్పు చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు సాయి అభ్యంకర్. ఈ రెండు చిత్రాలు రిలీజ్ కాకముందే అల్లు అర్జున్, అట్లీల ‘రాకా’ సినిమాలో అతను ఛాన్స్ అందుకోవడం విశేషం. ఇది ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ మూవీస్లో ఒకటి. ఐతే ఇంత పెద్ద ప్రాజెక్టు చేస్తూ వరుసగా మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు చేజిక్కించుకుంటున్నాడు సాయి అభ్యంకర్.
ఇటీవలే సూర్య, టి.జి.జ్ఞానవేల్ కాంబినేషన్లో హోంబలే ఫిలిమ్స్ అనౌన్స్ చేసిన చిత్రానికి కూడా అభ్యంకరే మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపికయ్యాడు. మరోవైపు ధనుష్ ‘ఓం’ చిత్రానికి అతనే సంగీతం అందిస్తున్నాడు. ఇంకా శింబు కొత్త చిత్రానికి కూడా అభ్యంకరే మ్యూజిక్ డైరెక్టర్గా ఖరారయ్యాడు.
లారెన్స్ హీరోగా లోకేష్ కనకరాజ్ ఎల్సీయూలో భాగంగా తీస్తున్న సినిమాకు అభ్యంకరే మ్యూజిక్ డైరెక్టర్.
కార్తి, శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి చిత్రాలకూ అభ్యంకర్ పని చేయబోతున్నాడు. కెరీర్ ఆరంభంలోనే ఇంత తక్కువ టైంలో ఇన్ని క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకోవడం అద్భుతమే. అనిరుధ్ సైతం మొదట్లో ఈ రేంజిని అందుకోలేదు. ఈ చిత్రాలతో అంచనాలను అందుకోగలిగాడంటే.. అనిరుధ్ను మించి ఎదిగిపోయేలా కనిపిస్తున్నాడు సాయి అభ్యంకర్.
Gulte Telugu Telugu Political and Movie News Updates