ఇరుముడికి పొంచి ఉన్న రెండు ముప్పులు

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో కథ ఎలా ఉండబోతోందనే ఐడియా ఇచ్చేశారు. తాజాగా విడుదల చేసిన ఇరుముడి కట్టు పాట అయ్యప్ప స్వామి భక్తులను ఆకట్టుకునే విధంగా సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేయడం అంచనాలు పెంచేందుకు దోహదపడుతోంది. నల్లని దుస్తుల్లో రవితేజ చైల్డ్ ఆర్టిస్టుతో వేస్తున్న స్టెప్పులు చాలా హుషారుగా మళ్ళీ చూసేలా ఉన్నాయి.

ఇక్కడితో అయిపోలేదు. నెక్స్ట్ రావాల్సిన మల్లెపూల పల్లకి పాట మీద అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. హక్కులు కొని మరీ దీన్ని ఇరుముడి కోసం వాడుతున్నారు. తండ్రి కూతురు సెంటిమెంట్ బలంగా ఉన్న ఈ సినిమాలో ఆ అంశం కన్నా అయ్యప్ప భక్తి ఎలిమెంట్ నే ఎక్కువగా హైలైట్ చేయడం ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకున్న వైనం స్పష్టంగా అర్థమవుతోంది. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ని పెద్దగా చూపించి చూపించకపోవడానికి కారణం ఇదేనేమో.

దర్శకుడు శివ నిర్వాణ ఈ ఇరుముడి కోసం బాగా కష్టపడుతున్నారు. మజిలీ తర్వాత మళ్ళీ తన ముద్ర బలంగా వేయలేకపోయారు. టక్ జగదీశ్ ఓటిటిలో వచ్చినా ఫ్లాప్ అనిపించుకోగా ఖుషి అంచనాలు పూర్తి అందుకోలేకపోయింది. అందుకే కాస్త ఎక్కువ సమయం తీసుకుని ఇరుముడి మీద వర్క్ చేశారు. ఎక్కువగా అయ్యప్పని ఫోకస్ చేస్తున్నారు కానీ పబ్లిసిటీలో చూపించని రివెంజ్ పాయింట్ సినిమాలో చాలా బలంగా, ఇంటెన్స్ గా ఉంటుందని టాక్.

ప్యారడైజ్ తప్పుకోవడం ఇరుముడికి చాలా ప్లస్ అయ్యింది. కాకపోతే వారం తిరక్కుండానే ఆగస్ట్ 26 యష్ ‘టాక్సిక్’ రావడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇరుముడికి కేరళ మార్కెట్ చాలా కీలకం. జనాలు శబరిమల వెళ్లే ప్రణాళికలు ఈ నెల నుంచే ఊపందుకుంటాయి. అందుకే ఆ రాష్ట్రంలో మంచి రిలీజ్ చేయాలనేది నిర్మాణ సంస్థ మైత్రి ప్లాన్. ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే దుల్కర్ సల్మాన్ ఐ యాం గేమ్ కూడా ఒక రోజు ముందు ఆగస్ట్ 20 విడుదలకు రెడీ కావడం. చూడాలి మరి ఈ రెండు ముప్పులను ఇరుముడి ఎలా ఫేస్ చేస్తుందో.