ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు తీసుకొచ్చి మరీ తీర్చింది. డబ్బింగ్ వెర్షన్ వీరభద్రుడు నెగటివ్ టాక్ లోనూ వసూళ్లు రాబట్టడం అనూహ్యమని చెప్పాలి. ఆగస్ట్ లో విశ్వనాథ్ అండ్ సన్స్ తో తక్కువ గ్యాప్ లో సూర్య మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆల్రెడీ ఒక లిరికల్ సాంగ్ విడుదల చేయగా వచ్చే నెల నుంచి సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రమోషన్ల వేగం పెంచనుంది.
దీని తర్వాత ప్రస్తుతం జీతూ మాధవన్ డైరెక్షన్లో సూర్య ఒక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాక కాక, సింగం తర్వాత వాటిని మించిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్యని కొత్తగా చూస్తారని చెన్నై మీడియా తెగ చెబుతోంది. ఫహద్ ఫాసిల్ కు ఆవేశం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన జీతూ మాధవన్ దర్శకుడు కావడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదింకా షూటింగ్ లో ఉండగా సూర్య తనకు జై భీం ఇచ్చిన టీజె జ్ఞానవేల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇవాళ ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. హోంబాలే ఫిలింస్ దీనికి నిర్మాతగా వ్యవహరించనుండగా కయదు లోహర్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఇక్కడ సూర్య ప్లానింగ్ ని మెచ్చుకోవాలి. ఇకపై కెరీర్ లో ఎక్కువ గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతూ వరసగా సినిమాలను ఒప్పేసుకుంటున్నాడు. కంగువ, రెట్రో కొట్టిన దెబ్బల నుంచి కోలుకున్నాక ఇంత వేగంగా కంబ్యాక్ అవ్వడం అభిమానులను సంతోషం కలిగిస్తోంది.
ఇకపై దీన్ని నిలబెట్టుకోవడం మీద సూర్య దృష్టి పెట్టాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా మార్కెట్ మళ్ళీ మొదటికే వస్తుంది. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడున్న హీరోల్లో ఆయన వదిలేసిన మాస్ వర్గాన్ని తిరిగి ఆకట్టుకునే సత్తా ఉన్న హీరో సూర్యనే అని ఫ్యాన్స్ నమ్మకం. కాకపోతే సరైన కథలు, దర్శకులు, కాంబినేషన్లు పడాలి. సూర్య ఇంకొంచెం కష్టపడితే దాన్ని అందుకోవడం సులభమే. రజనీకాంత్ సెలెక్టివ్ అయిపోగా అజిత్ ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates