కరోనా తర్వాత ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్, స్కామ్ 1992 లాంటి బ్లాక్ బస్టర్స్ వల్ల కొంత కాలం వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ దక్కింది. ఎంతగా అంటే ఏదైనా కొత్త కంటెంట్ రిలీజవుతోందంటే అర్ధరాత్రి మేలుకుని మరీ స్ట్రీమింగ్ చేసే దాకా మూవీ లవర్స్ నిద్రపోయేవారు కాదు. అంతగా ఇవి జనంలోకి చొచ్చుకుపోయాయి. తర్వాత వీటి జోరు తగ్గింది. ఒకే జానర్ లో ఎక్కువ సిరీస్ లు రావడం వల్ల క్రమంగా వ్యూస్ తగ్గడం ఆరంభించాయి. ఇప్పుడీ ట్రెండ్ మళ్ళీ ఊపందుకునేలా ఉంది.
ఇప్పటిదాకా హిందీకే అధిక శాతం పరిమితమైన వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులోనూ స్పీడ్ పెంచుతున్నాయి. జూలై 3 ఏకంగా నాలుగు స్ట్రెయిట్ కంటెంట్లు రానుండటం విశేషమే అని చెప్పాలి. సందీప్ కిషన్ నటించిన ‘సూపర్ సుబ్బు’ని చాలా సెన్సిటివ్ ఇష్యూ మీద వినోదాత్మకంగా తీసిన వైనం ట్రైలర్ లో కనిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ మొదటిసారి ఒక ఇమేజ్ ఉన్న హీరోతో తీసిన టాలీవుడ్ వెబ్ సిరీస్ ఇది. హీరో స్వయంగా పబ్లిసిటీలో భాగమవుతూ ఇంటర్వ్యూలలో దాని విశేషాలు చెబుతున్నాడు.
సముతిరఖని, ఐశ్వర్వ్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఇసుకపట్నం’ ఇదే రోజు అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియర్ కానుంది. మాఫియా, రాజకీయాలు, సముద్ర తీరం ఇలా తెలిసిన సెటప్ తీసుకున్నప్పటికీ ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాగా తీర్చిదిద్దినట్టు చెబుతున్నారు. ఒకప్పుడు బుల్లితెరను ఊపేసిన మర్మదేశం ఆధారంగా తీసిన ‘వీరభద్రుని రహస్యాలు’ జీ ఫైవ్ లో రానుంది. పేరున్న సపోర్టింగ్ ఆర్టిస్టులు చాలా ఉన్నారు. సూర్య కరుప్పు తరహా ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి.
బేబి ఫేమ్ విరాజ్ అశ్విన్ నటించిన ‘గుర్తుకొస్తున్నాయి’ ఈటీవీ విన్ వేదికగా విడుదల చేయబోతున్నారు. నోస్టాల్జియా జ్ఞాపకాలకు తవ్వేలా కొంచెం కొత్త ప్రయత్నమే చేసినట్టు ఉన్నారు. ఒకపక్క థియేటర్లలో నాగబంధం, రావు బహదూర్ లాంటి రిలీజులు ఉండగా ఇంకోవైపు ఓటిటిలో కూడా చెప్పుకోదగ్గ ఆప్షన్లు ఆడియన్స్ ని ఊరిస్తున్నాయి. వీటిలో ఏవి ఏ మేరకు ఆదరణ పొందుతాయో ఒక వారం ఆగితే వ్యూస్ ని బట్టి స్పష్టత వస్తుంది. వీటికి ప్రమోషన్లు, ఈవెంట్లు కూడా ఘనంగా చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates