సాహో హీరోయిన్ ‘ఈథ’కు టైటిల్ వివాదం

ఒకవేళ సాహో పెద్ద హిట్టయ్యింటే హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగులో వరసగా కనిపించేదేమో కానీ అనుకున్న ఫలితం అందుకోకపోవడంతో పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమయ్యింది. ముఖ్యంగా స్త్రీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తన మార్కెట్ ని బాగా పెంచింది. ఇదిలా ఉండగా ఆగస్ట్ 28 విడుదల కాబోతున్న ఆమె కొత్త మూవీ ఈథ చుట్టూ వివాదం ముసురుకుంది. చావా లాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ తీసిన లక్ష్మణ్ ఉతేకర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇంతకీ కాంట్రావర్సి ఎందుకు వచ్చిందో చూద్దాం.

ఈథని ప్రముఖ మరాఠి జానపద కళాకారిణి విఠాబాయి భావు మాంగ్ నారాయణగావ్కర్ జీవితం ఆధారంగా రూపొందించారు. ఈమెకు తమాషా సామ్రాజ్ఞి అనే బిరుదు ఉంది. హాస్యంని మేళవిస్తూ పాటలు పడుతూ నృత్యం చేయడం ఆవిడకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడైనా విఠాబాయి నృత్య కార్యక్రమం ఉందంటే అక్కడ వేల సంఖ్యలో ప్రేక్షకులు పోగయ్యేవారు. 1950 టైంలో నిండు గర్భిణీగా స్టేజి మీద డాన్స్ చేస్తూ అక్కడే నొప్పులు వస్తే తెర వెనుక వెళ్లి బిడ్డకు జన్మనివ్వడం అప్పట్లో పెద్ద సంచలనం.

1935లో జన్మించిన విఠాబాయి 2002లో కన్నుమూశారు. జీవితంలో రెండుసార్లు రాష్ట్రపతి పురస్కారాలు అందుకున్నారు. చివరి దశలో పేదరికం చూశారు. ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆవిడ లైఫ్ మీద లక్ష్మణ్ ఉతేకర్ చాలా రీసెర్చ్ చేశారు. టీజర్ లో చూపించిన లాస్ట్ షాట్ ఇప్పటికే హాట్ టాపిక్ ఐయ్యింది. విఠాబాయి కుటుంబ సభ్యులు టైటిల్ ఆమె పేరు మీద కాకుండా ఈథ అని పెట్టడం పట్ల తీవ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు కూడా వెళ్లే ఆలోచన చేస్తున్నారు.

ఇప్పటికైతే యూనిట్ దీని గురించి స్పందించలేదు. ఈథని హిందీ మరాఠితో పాటు తెలుగులాంటి ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేయబోతున్నారు. శ్రద్ధ కపూర్ కెరీర్ బెస్ట్ నటన ఇందులో చూడొచ్చని టీమ్ నమ్మకంగా చెబుతోంది. హారర్ సినిమాలు ఎక్కువగా తీసే మాడక్ ఫిలింస్ చావా తరహాలోనే ఈథని పీరియాడిక్ సెటప్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. రందీప్ హుడా, మహమ్మద్ జీషాన్ అయ్యుబ్ ఇతర పాత్రలు పోషిస్తుండగా అజయ్ అతుల్ సంగీతం సమకూరుస్తున్నారు.