బుచ్చిబాబు అడుగులు ఎటు వెళ్తాయి

పెద్ది థియేటర్ రన్ ఈ సండేతో ముగిసినట్టే. నాలుగో వారంలో ఓ మోస్తరుగా ఆడుతోంది కానీ వీక్ డేస్ లో చెప్పుకోదగ్గ వసూళ్లు లేవు. మా ఇంటి బంగారం అనూహ్యంగా హిట్ కావడం పెద్దికి మైనస్ అయ్యింది. రామ్ చరణ్ లండన్ వెళ్లి అక్కడ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ముందే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ కావడంతో దానికి అనుగుణంగా టూర్ కొనసాగుతోంది. ఇప్పుడు అందరి చూపు దర్శకుడు బుచ్చిబాబు మీదకు వెళ్తోంది. నెక్స్ట్ ఎవరితో చేస్తారనే ప్రశ్న ఆసక్తి రేపుతోంది.

ఉప్పెన తర్వాత ఏకంగా ఐదేళ్ళు గ్యాప్ రావడం బుచ్చిబాబు మైనస్ గా ఫీలవ్వలేదు. ఎందుకంటే రామ్ చరణ్ తనను నమ్మి పెద్ది లాంటి భారీ ఆఫర్ ఇవ్వడం వల్ల. అంతేకాదు కథ డిమాండ్ మేరకు ఒళ్ళు హూనం చేసుకున్నాడు. విపరీతంగా కష్టపడ్డాడు. మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రావడంలో తనవంతు బాధ్యత పూర్తిగా నెరవేర్చాడు. కానీ ఓవర్సీస్, బాలీవుడ్, కేరళ తమిళనాడులో ఆశించిన ఫలితం రాకపోవడం బుచ్చిబాబు బ్రాండ్ మీద ప్రభావం చూపించింది.

ఎందుకంటే రాజమౌళి, ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లు హిందీలోనూ తమ జెండా పాతారు. బుచ్చిబాబు పెద్దితో ఈ లీగ్ లోకి వెళ్లిపోవచ్చని భావించారు. కానీ అలా జరగలేదు. మహేష్ బాబు తనతో చేయడం పట్ల ఆసక్తిగా ఉన్నాడనే ప్రచారం జరిగింది. కానీ వారణాసి తప్ప వేరే ప్రపంచం లేదన్నట్టు బిజీగా ఉన్న సూపర్ స్టార్ ఇప్పుడప్పుడే కథలు వినే ఉద్దేశంలో లేరట. సో ఎంతలేదన్నా ఇంకో ఏడాది వెయిటింగ్ ఎవరికైనా తప్పదు.

విచిత్రంగా ఇప్పుడు బుచ్చిబాబు ముందు ఉన్న ఆప్షన్లు తక్కువే. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, నాని ఇంకో రెండు మూడు సంవత్సరాల వరకు దొరికేలా లేరు. పోనీ రామ్ చరణ్ ని మళ్ళీ ట్రై చేద్దామన్నా గురువు సుకుమార్ లాక్ చేసుకున్నారు. సో ఛాన్స్ లేదు. మీడియం రేంజ్ హీరోతో చేస్తే ఇమేజ్ తగ్గే రిస్క్ లేకపోలేదు. ఈ మీమాంసలో బుచ్చిబాబు ఇంకొంత కాలం వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు తెలిసింది. తన టీమ్ ని ఖాళీగా ఉంచకుండా ఏకకాలంలో రెండు కథల మీద వర్క్ చేయిస్తున్నారట.