సింగీతం మెచ్చిన పుష్ప

వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం తీసి ఆశ్చర్యపరిచారు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఈ వయసులో సినిమా తీయడం ఒకెత్తయితే.. దాన్ని హిట్ చేయడం మరో ఎత్తు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సింగ్ గీతం’ ఈ తరం ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ హిట్ దిశగా సాగుతోంది.

40 ఏళ్ల కిందట సింగీతం ఇలాంటి ఆలోచన చేయడం.. ఇన్నేళ్లు ఆ ఐడియాను నమ్మి ఎదురు చూడడం.. ఈ తరం ప్రేక్షకులతోనూ ఇది కొత్తగా ఉంది అనిపించి సక్సెస్ చేయడం చిన్న విషయం కాదు. ఈ ఉత్సాహంలో ఆయన చెన్నైలోని తన ఇంటి నుంచి తెలుగు జర్నలిస్టులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో తనకు నచ్చిన రెండు సినిమాల గురించి ఆయన వెల్లడించారు. అందులో సుకుమార్, అల్లు అర్జున్‌ల ‘పుష్ప-2’ ఉండడం విశేషం.

‘‘నన్ను ఈ మధ్య అత్యంత ఆకట్టుకున్న సినిమాలు.. పుష్ప-2, కాంతార. ప్రత్యేకంగా పుష్ప-2లో హీరో పాత్ర చిత్రణ నాకు చాలా నచ్చింది. ఇక కాంతార ఒక అద్భుతమైన సినిమా. ఆ సినిమాలో భావోద్వేగాలు , పాత్రల రూపకల్పన, కథనం ఎంతో బలంగా ఉన్నాయి’’ అని సింగీతం వ్యాఖ్యానించారు. కెరీర్ ఆరంభం నుంచి ఎప్పుడూ వైవిధ్యమైన కథాంశాలతో గొప్ప గొప్ప ప్రయోగాలు చేసిన దర్శకుడు మెచ్చాడంటే ఈ సినిమాల మేకర్స్ దాన్నో ఘనతగా భావించాల్సిందే.

ఇక తన సినిమా ‘సింగ్ గీతం’ గురించి మాట్లాడుతూ.. ఇది జెన్‌జీ కోసం రూపొందించిన సినిమా అని, వారికి ఇది నచ్చడం తనకెంతో ఆనందంగా ఉందని.. తన కెరీర్లో ఇది అత్యుత్తమ దశ అని ఆయన వ్యాఖ్యానించారు. కాల క్రమంలో ‘సింగ్ గీతం’ ఇంకా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ నాగ్ అశ్విన్‌‌దే అని ఆయన స్పష్టం చేశారు.