వివాదాల వరలక్ష్మి… అరకొర సమాధానం

తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు తాను ఇచ్చిన కథను ఎలా పడితే అలా మార్చేశారంటూ ఆ మధ్య రచయిత సాయి మాధవ్ బుర్రా ఎంత అసహనం వ్యక్తం చేశారో తెలిసిందే. దీని మీద వరలక్ష్మి సరైన సమాధానం ఇవ్వలేకపోయింది.

కట్ చేస్తే ఇప్పుడు ‘పోలీస్ కంప్లైంట్’ అనే సినిమాకు కోరినంత పారితోషకం తీసుకున్న వరలక్ష్మి.. ప్రమోషన్లకు మాత్రం రావడం లేదంటూ ఆ చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి చేసిన ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. వరలక్ష్మి సొంత సినిమా ‘సరస్వతి’ కోసం తమ చిత్రాన్ని ఆలస్యం చేసినా సర్దుకున్నామని, కానీ ఇప్పుడు ‘పోలీస్ కంప్లైంట్’ ప్రమోషన్లకు రాకుండా తమను వరలక్ష్మి ఇబ్బంది పడుతోందంటూ సంజీవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఆరోపణలపై వరలక్ష్మి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందించింది.

పోలీస్ కంప్లైంట్ టీం‌కు తన అవసరం ఉన్నపుడల్లా తాను అందుబాటులోనే ఉన్నానని.. సినిమాకు సంబంధించి ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యానని వరలక్ష్మి స్పష్టం చేసింది. ‘పోలీస్ కంప్లైంట్’ ఈవెంట్లో దర్శకుడు ఏం మాట్లాడాడో తనకు ఎవరూ పూర్తిగా చెప్పలేదని చెప్పిన వరలక్ష్మి.. కొన్ని విషయాల్లో తనకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయని.. కాబట్టి తన మీద ఆ టీం చేసిన ఆరోపణల మీద బహిరంగంగా చర్చించాలని అనుకోవడం లేదని వరలక్ష్మి స్పష్టం చేసింది.

ఐతే నిన్నటి ఈవెంట్‌కు వరలక్ష్మి రాకపోవడం మీదే టీం నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ వరలక్ష్మి మాత్రం తాను ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యానని అంటోంది.
వరలక్ష్మికి తెలుగు బాగానే వచ్చు. ఆమె తెలుగులో తన పాత్రలకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పకుంటోంది. అలాంటపుడు ఆ ఈవెంట్లో దర్శకుడు ఏం మాట్లాడాడో తనకు ఎవరూ పూర్తిగా చెప్పలేదని అనడం విడ్డూరం.

ఒకవేళ తనకు తెలుగు అర్థం కాదనుకున్నా.. మూణ్నాలుగు నిమిషాల స్పీచ్‌‌లో దర్శకుడేం మాట్లాడాడో ఎవరితో అయినా చెప్పించుకోవడం పెద్ద విషయం కాదు. ప్రమోషన్లకు ఎందుకు రాలేదనే విషయంలో సూటిగా సమాధానం చెప్పకుండా.. ఇలా అరకొర వివరణ ఇవ్వడం వల్ల వరలక్ష్మికి ఇంకా డ్యామేజ్ జరగడమే తప్ప ప్రయోజనం ఏమీ లేదనే చెప్పాలి.