విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా చక్కగా నిర్వహించారు. ఫ్యాన్స్ వైపు అక్కడక్కడా చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నప్పటికీ ఇవి ప్రతి హీరో వేడుకలో సహజమే కాబట్టి అంతగా హైలైట్ కాలేకపోయాయి. కాస్ట్ అండ్ క్రూ మొత్తం హాజరు కాగా బయట ప్రచారం జరిగినట్టు పవన్ కళ్యాణ్ తో సహా ఏ ఇతర ప్రత్యేక అతిథి అక్కడికి వెళ్ళలేదు. కేవలం యూనిట్ సభ్యుల మధ్య జరిగింది.
ఇక రామ్ చరణ్ మాటలు పెద్ది మీద నమ్మకాన్ని మరింత పెంచాయి. బుచ్చిబాబుని ఏకంగా రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా లాంటి టాప్ డైరెక్టర్స్ తో పోల్చి త్వరలోనే ఆ స్థాయికి చేరుకుంటాడని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. చనిపోయే వరకు ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటానని, సినిమా తప్ప నాకు ఇంకేదీ తెలియదని చెప్పిన చరణ్ ఈ సందర్భంగా మగధీర, ఆర్ఆర్ఆర్, రంగస్థలంని గుర్తు చేసుకోవడం చూస్తే కెరీర్ బెస్ట్ లో పెద్దికి పెద్ద స్థానం ఇవ్వబోతున్నట్టు అర్థం చేసుకోవచ్చు.
చిరంజీవి కొడుకుగా పుట్టినందుకు, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్నందుకు మీ కోసం మంచి సినిమా ఇచ్చే తీరాలన్న పిచ్చి తనలో బలంగా ఉందని చెప్పిన చరణ్ విజయవాడ లక్ గురించి ప్రస్తావిస్తూ ఖైదీ నెంబర్ 150, ఇంద్ర వేడుకలు ఇక్కడే జరిగిన పాజిటివ్ సెంటిమెంట్ ని ఫ్యాన్స్ కి గుర్తు చేశాడు. జాన్వీ కపూర్, జగపతి బాబు మీద ప్రశంసలు గుప్పించిన రామ్ చరణ్ నిర్మాత వెంకట సతీష్ కిలారుని కమిటెడ్ ప్రొడ్యూసర్ గా కితాబు ఇవ్వడం ఆకట్టుకుంది.
మొత్తానికి చరణ్ ఇలా మాట్లాడ్డం కొత్త కాకపోయినా ఈసారి చాలా స్పష్టమైన నిజాయితీ కనిపించింది. రక్తం చిందించి అయినా సరే మిమ్మల్ని మెప్పిస్తానని చెప్పడం చూస్తుంటే పెద్ది మీద కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి తన నుంచి అభిమానులు ఏం కోరుకున్నారో దాన్ని స్పీచ్ రూపంలో ఇచ్చిన రామ్ చరణ్ జూన్ 3 రాత్రి ప్రీమియర్ షోలలో అంతకు మించి ఇస్తే బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఏంటో మరోసారి మెగా పవర్ స్టార్ చూపించినట్టు అవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates