దాసరి స్మృతి వనం… కదిలిపోయిన మనోజ్

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం అంటే చిన్న విషయం కాదు. అందులో మెజారిటీ సినిమాలు విజయవంతం అయ్యాయి. ప్రేమాభిషేకం సహా ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఆయన సొంతం.

ఐతే దాసరి గొప్పదనం కేవలం దర్శకత్వానికే పరిమితం కాదు. ఎన్నో ఏళ్ల పాటు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన, ఎన్నో సమస్యలు పరిష్కరించిన ఘనత ఆయన సొంతం. అందుకే ఇండస్ట్రీలో ఎంతోమంది ఇప్పటికీ దాసరిని దేవుడిలా చూస్తారు. అలాంటి వ్యక్తి స్మృతి వనం నిరాదరణకు గురి కావడం ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేసింది.

హైదరాబాద్‌లో దాసరి సమాధి ఉన్న ప్రాంతం చెట్లు పెరిగి, చుట్టూ చెత్త పేరుకుపోయి అధ్వాన్న స్థితికి చేరుకున్న వైనం గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఈ రోజు వీడియోలు వైరల్ అయ్యాయి.

ఈ విషయంలో వెలుగులోకి రాగానే మంచు మనోజ్ అప్రమత్తం అయ్యాడు. తన అనుచరులతో కలిసి దాసరి స్మృతి వనానికి హుటాహుటిన చేరుకున్నాడు. తన బృందంతో కలిసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు మనోజ్. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ కావడంతో మరికొందరు సినీ జనాలు దాసరి స్మృతి వనం దగ్గరికి చేరుకున్నారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మనోజ్ సోదరుడు మంచు విష్ణు సైతం ఈ విషయం మీద స్పందించాడు. దాసరి స్మృతి వనాన్ని సినిమా వాళ్లు పట్టించుకోకుండా వదిలేశారంటూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల మీద విష్ణు స్పందిస్తూ.. దీనిపై తగు చర్యలు చేపడుతున్నామని, ఇక దీన్ని ఇంతకుమించి వివాదం చేయొద్దని కోరారు.

ఇటీవలే దాసరి జయంతి వేడుకలను ఘనంగా చేశారు. ఆయన జయంతిని డైరెక్టర్స్ డేగా సినీ పరిశ్రమ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. జయంతి వేడుకలను అంత ఘనంగా చేసి, ఆయన సమాధిని మాత్రం ఇలా వదిలేయడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.