దృశ్యం 3… తెలుగు ప్రేక్షకులంటే లెక్క లేదా?

‘దృశ్యం’ అంటే తెలుగు ఆడియెన్స్‌కి ఫస్ట్ గుర్తొచ్చేది వెంకటేష్. రాంబాబుగా ఆయన పండించిన ఎమోషన్, టెన్షన్, తెలివి అన్నీ మన ఇంటి మనిషిలా ఫిక్స్ అయిపోయాయి. అలాంటి ఫ్రాంచైజ్‌కి మూడో పార్ట్ వస్తోంది కానీ వెంకీ లేడు. ఒరిజినల్ మలయాళం ‘దృశ్యం 3’ మోహన్‌లాల్‌తో మే 21న రిలీజ్. అదే రోజు తెలుగు డబ్బింగ్ కూడా వస్తుంది. రీమేక్ లేదు, వెంకటేష్ లేడు. ఇదెక్కడి చాదస్తం అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

సమస్య రీమేక్ లేకపోవడం కాదు. కమ్యూనికేషన్ లేకపోవడం. దృశ్యం 3 తెలుగులో వస్తోందని మేకర్స్ ఎక్కడా గట్టిగా చెప్పలేదు. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ హైదరాబాద్‌లో ఒక్క పోస్టర్ కనిపించలేదు. ప్రెస్‌మీట్ లేదు. తెలుగు మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.

‘మంజుమ్మెల్ బాయ్స్’ని పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ చేసిన తెలుగు మార్కెట్‌ని ఇంత లైట్ తీసుకోవడం ఆశ్చర్యం వేస్తోంది. కంటెంట్ మీద నమ్మకం ఉంది సరే, కానీ జనాలకు సినిమా రిలీజ్ అవుతోందని తెలియకపోతే ఎలా?

వెంకటేష్ తప్పుకోవడం వెనక కారణాలు ఏవైనా కావచ్చు. డేట్స్ క్లాష్, రెమ్యూనరేషన్, స్క్రిప్ట్ సంతృప్తి లేకపోవడం. కానీ ఆయన లేని లోటు తెలుగు వెర్షన్‌కి బాగా దెబ్బ కొడుతుంది. ‘దృశ్యం 2’ వరకు వెంకీ వల్లే ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు.

ఇప్పుడు సడన్‌గా మోహన్‌లాల్ వాయిస్‌తో డబ్బింగ్ చూస్తే ఆ ఫీల్ రాదు. పైగా ‘దృశ్యం’ కథలో లింకులు ఉంటాయి. మొదటి రెండు పార్ట్స్ వెంకీతో చూసిన వాళ్లు మూడో పార్ట్ వేరే హీరోతో చూడాలంటే మైండ్ సెట్ మారాలి. దానికి టైమ్ కావాలి, ప్రమోషన్ కావాలి.

కేరళలో మాత్రం ‘దృశ్యం 3’కి పాజిటివ్ బజ్ గట్టిగానే ఉంది. జీతూ జోసెఫ్ మార్క్ ట్విస్టులు, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ పీక్స్ అని లీకులు వస్తున్నాయి. ఎమోషన్ వర్కవుట్ అయ్యిందట. అంటే సినిమా క్వాలిటీ మీద డౌట్ లేదు. ఇక్కడే మేకర్స్ చేసిన తప్పు కనిపిస్తుంది.

చేతిలో స్ట్రాంగ్ ప్రొడక్ట్ పెట్టుకుని మార్కెటింగ్ జీరో పెట్టారు. ‘కాంతార’ని హోంబలే వాళ్లు ఒక్క వారంలో నేషనల్ హిట్ చేశారు. ‘దృశ్యం 3’కి ఆల్రెడీ బ్రాండ్ ఉంది. అయినా బజ్ క్రియేట్ చేయలేకపోయారు. ఈ చాదస్తం వల్ల నష్టపోయేది నిర్మాతలే.

తెలుగు స్టేట్స్‌లో థియేట్రికల్ రెవెన్యూ పోతుంది. OTTకి అమ్మినా, థియేటర్ బజ్ లేకపోతే రేటు తగ్గుతుంది. ప్రేక్షకుడి కోణంలో చూస్తే, మంచి సినిమా మిస్ అవుతాం. ‘వెంకీ లేకుండా దృశ్యం ఎలా?’ అనే డౌట్‌తో చాలా మంది థియేటర్‌కి రారు. వచ్చినా కనెక్ట్ కాలేరు.