“జెంటిల్మన్ ని… డాబర్ మన్ లా చూపారు”

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మరోమారు మీడియా ముందుకు వచ్చారు. జెంటిల్మన్ ని అయిన తనను డాబర్ మన్ లా చూపారంటూ ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. గురువారం హైదరాబాద్ లో మీడియా ముందుకు వచ్చిన సందర్భంగా ఆయన తనదైన శైలి మేనరిజమ్ ప్రదర్శిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నోట పలు రాజకీయ వ్యాఖ్యలు కూడా వినిపించాయి.

ఇప్పటిదాకా తాను ఏ ఒక్కరికీ అన్యాయం చేసింది లేదని, ఒక్క రూపాయి కూడా పరుల సొమ్ము ముట్టలేదని పోసాని తెలిపారు. ఇప్పటిదాకా తాను తప్పే చేయలేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్కరిని కూడా మోసగించలేదని పోసాని తెలిపారు. ఏదో ప్రజలకు మంచి చేస్తున్న పార్టీకి మద్దతు ఇచ్చాను తప్పించి తాను ఏ ఒక్క రాజకీయ పార్టీలో చేరలేదని చెప్పారు. వైసీపీలోనూ తాను చేరలేదని ఆయన అన్నారు. మొత్తంగా జెంటిల్మన్ గా జీవనం సాగిస్తున్న తనను డాబర్ మన్ లా చూపించారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆది నుంచి టీడీపీ అంటే విపరీతమైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వచ్చిన పోసాని… వైసీపీకి అనుబంధంగా సాగారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు మద్దతు పలికారు. జగన్ తో కలిసి అడుగు వేశారు. వైసీపీ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ పట్ల తనలోని వ్యతిరేకతను ఆయన మరింతగా బయటపెట్టారు.

టీడీపీ కీలక నేతలను టార్గెట్ చేస్తూ అనచిత వ్యాఖ్యలూ చేశారు. ఈ క్రమంలో కూటమి సర్కారు వచ్చాక… పోసాని అరెస్టు కాగా… పోలీసులు ఆయనను పలు స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఈ క్రమంలో ఇక తాను రాజకీయ వ్యాఖ్యలు చేయనంటూ పోసాని సంచలన కామెంట్ చేశారు. తాజాగా ఆయన మరోమారు రాజకీయ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.