మన లేడీ డైరెక్టర్.. ఒక్కటి కొడితే..

టాలీవుడ్‌లో కమర్షియల్ హంగులతో కూడిన సినిమాల మధ్య ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్స్, క్లీన్ కామెడీని నమ్ముకునే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో నందిని రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇండస్ట్రీలో దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, కృష్ణవంశీ వంటి దిగ్గజ దర్శకుల దగ్గర ‘మురారి’ వంటి చిత్రాలకు పనిచేసిన ట్రాక్ రికార్డ్ ఆమె సొంతం. అయితే ఇంతటి ప్రతిభ ఉన్నప్పటికీ, నందిని రెడ్డి మార్కెట్ ఇంకా ఒక లెవల్ దగ్గరే ఆగింది.

టాలెంట్ ఉంటే జెండర్ తో సంబంధం లేకుండా అవకాశాలు ఇచ్చే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. స్టార్ హీరోలు కూడా క్యూ కడతారని బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఎందరో లేడీ డైరెక్టర్లు నిరూపించారు. నందిని రెడ్డి కెరీర్ గ్రాఫ్ చూస్తే.. 2011లో నాని, నిత్యా మీనన్ జంటగా వచ్చిన ‘అలా మొదలైంది’ చిత్రంతో ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

ఆ సినిమాతో ఏకంగా నంది అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత ‘జబర్దస్త్’ వంటి పరాజయాలు ఆమె వేగాన్ని తగ్గించాయి. కానీ 2019లో సమంతతో చేసిన ‘ఓ బేబీ’ మళ్ళీ ఆమెను రేసులోకి తెచ్చింది.

ఒక 70 ఏళ్ల బామ్మ పాత్రను యువతిగా చూపించి, అందులో ఎమోషనల్ పండించిన తీరు చూసి అందరూ ఆమె ఇక టైర్ 2, టైర్ 1 స్టార్లతో సినిమాలు చేయడం ఖాయమని భావించారు.
అయితే ఆ తర్వాత ఆమె మళ్ళీ చిన్న సినిమాలకే పరిమితం కావడం కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. బాలీవుడ్‌లో జోయా అక్తర్, గౌరీ షిండే వంటి వారు ఖాన్ల నుంచి కపూర్ల వరకు అందరినీ హ్యాండిల్ చేస్తున్నారు. సౌత్‌లో కూడా సుధ కొంగర సూర్యతో ‘ఆకాశం నీ హద్దురా’ వంటి నేషనల్ లెవల్ హిట్ కొట్టి తన సత్తా చాటారు. నందిని రెడ్డిలో కూడా అలాంటి క్రాఫ్ట్ ఉంది.

ఇప్పుడు అందరి కళ్ళు ఆమె రాబోయే చిత్రం ‘మా ఇంటి బంగారం’ మీద ఉన్నాయి. జూన్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా నందిని రెడ్డి కెరీర్‌లో అత్యంత కీలకం కానుంది. ఐపీఎల్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం గనుక బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, టాలీవుడ్‌లో కూడా లేడీ డైరెక్టర్లు స్టార్ హీరోలను లీడ్ చేయగలరనే నమ్మకం బలపడుతుంది. కంటెంట్ మీద గ్రిప్ ఉన్న నందినికి ఒక సరైన మాస్ కమ్ క్లాస్ హిట్ పడితే, టైర్ 1 హీరోలు కూడా ఆమెతో వర్క్ చేయడానికి వెనుకాడరు. మరి నందిని రెడ్డి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.