చేతులు కాలాక చింతించి ఏం లాభం

2026 బాలీవుడ్ అతి పెద్ద డిజాస్టర్ గా ఏక్ దిన్ నిలవనుంది. మాములుగా అయితే దీని హీరో జునైద్ ఖాన్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోనవసరం లేదు. కానీ హీరోయిన్ సాయిపల్లవి కావడం వల్లే తెలుగులో డబ్బింగ్ చేయడంతో పాటు మీడియాలో ఆమెనే హైలైట్ చేశారు నిర్మాత అమీర్ ఖాన్. ఇంతా చేసి ఆఖరికి దారుణమైన ఫలితం మూటగట్టుకుంది. మితిమీరిన డ్రామాని ఆడియన్స్ భరించలేక మేం థియేటర్లకు వెళ్ళం బాబోయ్ అంటూ యునానిమస్ తీర్పు ఇచ్చేశారు.

తాజాగా సాయిపల్లవి ఈ ఫలితం గురించి స్పందించింది. ఏక్ దిన్ ముందు తన దగ్గరికి వచ్చినప్పుడు వద్దనుకున్నానని, అయితే తనకు బాగా ఇష్టమైన హాలీవుడ్ హిట్ ‘బిఫోర్ సన్ రైజ్’లాగా అనిపించడంతో ఒప్పుకున్నానని చెప్పింది. ముంబైలో స్పెషల్ ప్రీమియర్ షో అయ్యాక కూడా అమీర్ ఖాన్ తో తన బదులు వేరొకరు అయ్యుంటే బెటర్ ఛాయస్ అయ్యేదని, చలాకీగా ఉండే కొత్త అమ్మాయి ఎవరైనా ఇంకా బాగుండేదని, న్యాయం చేసేవారని చెప్పినట్టుగా గుర్తుచేసుకుంది.

ఇదంతా ఇప్పుడు ఓకే కాని చేతులు కాలాక చింతించి ఎలాంటి లాభం లేదు. నిజానికి ఏక్ దిన్ ఓపిగ్గా చూసేందుకు ఒకే ఒక్క కారణం ఏదైనా చెప్పమంటే ఠక్కున సాయిపల్లవి అని చెప్పాలి. అంతగా మీరా పాత్రలో జీవించేసింది. ముందే చెప్పినట్టు భావోద్వేగాలు మరీ తీవ్రంగా ఉండటం, నెరేషన్ నత్త నడకన సాగడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తట్టుకోలేకపోయారు. తెలుగులో ఒక రోజు పేరుతో డబ్బింగ్ చేస్తే ఒక్క ఆటకే జనం నో అనేశారని వసూళ్లు స్పష్టం చేశాయి.

సాయిపల్లవి దీపావళికి రామాయణ రూపంలో అసలైన పరీక్ష ఎదురుకోనుంది. పవిత్ర సీత పాత్రలో ఎంత బాగా చేసి ఉంటుందనే దాని మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ రన్బీర్ కపూర్, యష్ లాంటి టాలెంటెడ్ హీరోస్ మధ్య నటించడమంటే మాటలు కాదు. సీత క్యారెక్టర్ క్లిక్ అయిపోయి సినిమా బ్లాక్ బస్టర్ సాధిస్తే సాయిపల్లవికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఇది కాకుండా ధనుష్ 55వ మూవీలో శ్రీలీలతో పాటు తను మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.