ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ఇందులో హీరో. కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రం.. ఆసక్తికరమైన సమకాలీన కథతో తెరకెక్కింది. అమెరికాకు వెళ్లి ఎంఎస్ చేసి బాగా డబ్బులు సంపాదించాలని ఆశించే ఒక కుర్రాడు.. డొనాల్డ్ ట్రంప్ పెట్టిన వీసా షరతులతో అక్కడికి వెళ్లలేక ఆగిపోవడం.. ఈ క్రమంలో ట్రంప్ మీద పగబట్టడం.. తదనంతర పరిణామాలతో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు ట్రంప్ చుట్టూనే తిప్పారు. ఏఐ ద్వారా ట్రంప్ పాత్రను క్రియేట్ చేసి.. ఆయనకు, తరుణ్కు మధ్య సరదా సంభాషణలు పెట్టి ఫన్నీ క్యాంపైన్ నడిపించారు. ఐతే ఈ సరదా వ్యవహారం కాస్తా సీరియస్ అయి.. ‘గాయపడ్డ సింహం’ చిత్రం రిలీజ్ ఆగిపోయే పరిస్థితి వచ్చిందట.
ఈ వారం ఈ సినిమా విడుదల కాదేమో అని చిత్ర బృందం విపరీతంగా టెన్షన్ పడిందట. మంగళవారం రాత్రి జరిగిన ‘గాయపడ్డ సింహం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో నటుడు జేడీ చక్రవర్తి ఈ విషయాన్ని వెల్లడించాడు. జేడీ ఇందులో విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ సినిమా విడుదలను ఆపించడానికి చూసిందని చెప్పాడు. ఈ విషయం చెప్పొచ్చా అని టీం సభ్యులను అడిగిన జేడీ.. వాళ్లు వద్దు అనగానే, అలా అయితే చెప్పాల్సిందే అంటూ అసలు విషయం చెప్పాడు.
ఐతే ఇది జోక్ అనుకుంటారేమో, నిజంగా చాలా సీరియస్ మేటర్ అంటూ ఒకటికి రెండుసార్లు నొక్కి వక్కాణించాడు. తమ సినిమాలో ట్రంప్ను బ్యాడ్ లైట్లో చూపించడం భారత ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని.. దీని వల్ల ఇండియాకు, అమెరికాకు మధ్య యుద్ధం వచ్చేస్తుందేమో అని ప్రభుత్వ వర్గాలు భయపడ్డాయని.. తమ సినిమాలో మంచి కామెడీ ఉందని, కానీ ఈ స్థాయి కామెడీ ఉందని తమకు తెలియదంటూ జేడీ సెటైరికల్గా మాట్లాడాడు.
తమ చిత్రం ఆ స్థాయి ప్రభావం చూపేలా ఉందంటే తనకు ఆశ్చర్యమేసిందని అతనన్నాడు. ఈ మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా సెన్సార్ బోర్డు అభ్యంతర పెడుతున్న నేపథ్యంలో జేడీ అన్న మాటల్లో అతిశయోక్తి ఏమీ లేకపోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
