రాధేశ్యామ్ దర్శకుడెక్కడ?

‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే అవకాశం అంటే అంతకంటే ఓ దర్శకుడికి అదృష్టం ఏముంటుంది? ఐతే ప్రభాస్‌తో సినిమా చేయడానికి పెద్ద పెద్ద దర్శకులు ఆసక్తితో ఉన్నప్పటికీ.. రెబల్ స్టార్ మాత్రం ఒకట్రెండు సినిమాల అనుభవమున్న డైరెక్టర్లతోనే పని చేశాడు. కానీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన మూడు చిత్రాలకు పని చేసిన యంగ్ డైరెక్టర్లు ఎవ్వరూ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు.

సుజీత్ తీసిన ‘సాహో’, రాధాకృష్ణకుమార్ చేసిన ‘రాధేశ్యామ్’, ఓం రౌత్ రూపొందించిన ‘ఆదిపురుష్’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఈ ముగ్గురు దర్శకుల కెరీర్లోనూ గ్యాప్ వచ్చింది. ఐతే సుజీత్ కొన్నేళ్ల తర్వాత అయినా పుంజుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం అందుకుని, ‘ఓజీ’తో మంచి ఫలితం రాబట్టాడు.

ఓం రౌత్‌ కొంచెం లేటుగా అయినా ధనుష్ హీరోగా అబ్దుల్ కలాం బయోపిక్ తీసేందుకు రెడీ అవుతున్నాడు. కానీ రాధాకృష్ణకుమార్ సంగతే ఎటూ తేలకుండా ఉంది. ‘రాధేశ్యామ్’ రిలీజై నాలుగేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా రాధాకృష్ణ కొత్త చిత్రం గురించి ఏ సమాచారం లేదు.

మధ్యలో తన తొలి చిత్రం ‘జిల్’ కథానాయకుడు గోపీచంద్‌తో రాధాకృష్ణ ఇంకో సినిమా చేస్తాడని.. అతడి రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేసిన యువి క్రియేషన్సే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్త నిజం కాలేదు. తర్వాత రాధాకృష్ణ గురించి మీడియా వాళ్లు కూడా ఏమీ పట్టించుకోలేదు.

యువి వాళ్లు ‘విశ్వంభర’లో తలమునకలయ్యారు. దాని బడ్జెట్ హద్దులు దాటిపోయి, రిలీజ్ బాగా ఆలస్యం అవుతుండడంతో వేరే ప్రాజెక్టుల మీద దృష్టిపెట్టే అవకాశం రావట్లేదు. మధ్యలో ‘కపుల్ ఫ్రెండ్లీ’ లాంటి చిన్న సినిమా తీశారంతే. ‘విశ్వంభర’ రిలీజై మంచి ఫలితాన్నందుకుంటే.. రాధాకృష్ణతో సినిమాను ముందుకు తీసుకెళ్లే అవకాశముంది.

మరి వేరే నిర్మాణ సంస్థల్లో అతను ఎక్కడా ప్రయత్నించట్లేదా.. తనతో సినిమా చేయడానికి ఇంకే హీరో ముందుకు రావట్లేదా అన్నదానిపై స్పష్టత లేదు. మరి ‘రాధేశ్యామ్’ దెబ్బ నుంచి ఎప్పటికి కోలుకుని కొత్త సినిమాతో రాధాకృష్ణ ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.