దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి ప్రయత్నిస్తారు. భాష విషయంలో ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తారు. కానీ తెలుగు వాళ్లలో మాత్రం మెజారిటీ జనాలకు వాళ్ల భాష మీద అంత ప్రేమ ఉండదు అన్నది నిష్ఠుర సత్యం. ముఖ్యంగా కొత్త తరంలో తెలుగు మీద పట్టు సాధించే వాళ్లు అంతకంతకూ తగ్గిపోతున్నారు. తెలుగు రాయడం, చదవడం గగనం అయిపోతోంది.
తెలుగులో గొప్ప సాహిత్యం ఉన్నా.. దాన్ని చదివేవాళ్లు, కొత్త తరాలకు అందించేవాళ్లు తగ్గిపోతుండడం ఆందోళనకర పరిణామం. మన సినీ సాహిత్యంలోని గొప్పదనాన్ని పర భాషకు చెందిన ఒక కథానాయిక గుర్తించి, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే.. ఆమెకు సహకారం అందించలేని స్థితిలో మన వాళ్లు ఉన్నారంటే అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? కన్నడ అమ్మాయి పాయల్ రాధాకృష్ణ ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించి ఆశ్చర్యపోయింది.
‘తరగతి గది దాటి’ అనే వెబ్ సిరీస్తో తెలుగులోకి అడుగు పెట్టిన పాయల్.. తర్వాత ప్రసన్నవదనం, చౌర్యపాఠం లాంటి చిత్రాల్లో నటించింది. తాజాగా ‘పాపం ప్రతాప్’ సినిమాతో పలకరించింది పాయల్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయం వెల్లడించింది.
పాయల్ మాతృభాష కొంకణి కాగా.. ఆమె కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషలు కూడా నేర్చుకున్నట్లు చెప్పింది. ఐతే తెలుగు సినిమాల్లో నటిస్తూ తెలుగు మీద పట్టు సాధించే క్రమంలో తనకు ఈ భాష ఎంతో నచ్చినట్లు ఆమె చెప్పింది. తెలుగు సినిమా పాటలు కూడా తనలో ఎంతో ఆసక్తి రేకెత్తించాయని, ముఖ్యంగా 90వ దశకంలో వచ్చిన పాటల్లో గొప్ప సాహిత్యం ఉందని తాను గుర్తించానని..
ఐతే ఆ పాటలు వింటూ లిరిక్స్ అర్థాలు తెలుసుకునేందుకు ఇక్కడి తెలుగు వాళ్లను అడిగితే, చాలామంది సరైన వివరణ ఇవ్వలేకపోయారని ఆమె వెల్లడించింది. నైంటీస్ కిడ్స్లో కూడా చాలామంది తెలుగు పదాలకు అర్థం తెలియదని చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందని.. తమ మాతృభాషను వాళ్లు సరిగా నేర్చుకోకపోవడమేంటో తనకు అర్థం కాలేదంటూ తెలుగు వాళ్ల దుస్థితిని.. భాష విషయంలో మన వాళ్ల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది పాయల్ రాధాకృష్ణ.
Gulte Telugu Telugu Political and Movie News Updates