మన నిర్మాతలకు గట్స్ ఎక్కువ బ్రో

పేరుకేమో.. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీల్లో ఒకటిగా పేరు. భారీ బడ్జెట్లు, రికార్డు బిజినెస్‌లు, కళ్లు చెదిరే పారితోషకాలు.. చివరికి చూస్తేనేమో వసూళ్లు అంతంతమాత్రం. సక్సెస్ రేట్ అంతకంతకూ తగ్గిపోతూ.. పది చిత్రాల్లో ఏడెనిమిది సినిమాలకు పెట్టిన డబ్బులు వెనక్కి రావడం కష్టమైపోతోంది.

చాలా సినిమాలకు బడ్జెట్లు హద్దులు దాటిపోయి డెఫిషిట్లో రిలీజవుతున్న పరిస్థితి. అయినా సరే.. నిర్మాతలేమీ తగ్గట్లేదు. హీరోల మార్కెట్ పరిమితులు చూడకుండా.. భారీగా ఖర్చు పెట్టేస్తున్నారు. దర్శకుల భారీ విజన్‌కు దృశ్యరూపం ఇవ్వడానికి రాజీ లేని ప్రయత్నం చేస్తున్నారు. 

టాలీవుడ్లో లేటెస్ట్‌గా వచ్చిన ‘భరతవర్ష’ సినిమా టీజర్ చూస్తే.. మన హీరోల మీద నిర్మాతల నమ్మకం ఎలాంటిదో అర్థమవుతుంది. ఈ చిత్ర కథానాయకుడు గోపీచంద్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా గుర్తుండకపోవచ్చు.

ఎప్పుడో 2014లో వచ్చిన ‘లౌక్యం’ తర్వాత అతడికి నిఖార్సయిన హిట్ లేదు. ఆ తర్వాత జిల్, గౌతమ్ నంద, సీటీమార్ లాంటి విషయం ఉన్న సినిమాలు చేసినా.. అవి అంతిమంగా అతడికి ఆశించిన విజయాలు అందించలేదు. చివరి చిత్రం ‘విశ్వం’తోనూ అతను నిరాశపరిచాడు.

ఇలా పుష్కర కాలంగా హిట్టు లేని హీరో మీద నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ పెట్టి ‘భరత వర్ష’ తీస్తున్నాడు. ఇది ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం. ‘ఘాజి’ తర్వాత అతను ‘అంతరిక్షం’ సినిమాతో షాక్ తిన్నాడు. ఈసారి గోపీచంద్‌తో ఒక భారీ ఈవెంట్ ఫిలిం ప్లాన్ చేశాడు సంకల్ప్.

శతాబ్దాల కిందటి కథతో ఇది తెరకెక్కుతోంది. అప్పటి వాాతావరణాన్ని తెరపైకి తీసుకురావడమే సవాలంటే.. అందులో యుద్ధాలకు తోడు భారీ ఎపిసోడ్లు చాలానే ఉండబోతాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయాలంటే వంద కోట్లకు తక్కువ బడ్జెట్ కాదు. 

‘భరత వర్ష’ బడ్జెట్ ఎంత అన్నది చెప్పలేదు కానీ.. గోపీచంద్ కెరీర్లోనే హైయెస్ట్ అని అర్థమవుతోంది. ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా గోపీని నమ్మి ఇంత భారీ సినిమా తీస్తున్న నిర్మాత గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక సంకల్ప్ సైతం ఈసారి భారీ విజన్‌తోనే రెడీ అయినట్లున్నాడు. టైటిల్ గ్లింప్స్‌లో విజువల్స్ సహా అన్నీ గొప్పగా అనిపించాయి. అన్నీ కుదిరితే.. ‘భరత వర్ష’ టాలీవుడ్లో ఒక సెన్సేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.