గత ఏడాది మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో కలంకవల్ సినిమా ఒక సంచలనం. కలెక్షన్ల పరంగా చూస్తే అదేమీ బ్లాక్ బస్టర్ కాదు. ఫుల్ రన్లో రూ.85 కోట్ల వసూళ్లు రాబట్టింది. మమ్ముట్టి నటించిన సినిమాకు ఇవి మరీ భారీ వసూళ్లేమీ కావు. మరి ఈ సినిమా ఎందుకంత సంచలనం అయింది అంటే.. మమ్ముట్టి లాంటి అగ్ర కథానాయకుడు ఇందులో విలన్ పాత్ర చేయడం వల్ల.
పైగా ఆయన చేసింది మామూలు ప్రతినాయక పాత్ర కాదు. మహిళలను వలలో వేసుకుని వారిని అనుభవించి, చంపేసే సైకో కిల్లర్ క్యారెక్టర్ను ఆయన పోషించారు. ఈ సినిమా విడుదలయ్యే ముందు వరకు మమ్ముట్టి విలన్ అని, ఇలాంటి పాత్ర చేశారని జనాలకు పెద్దగా ఐడియా లేదు.
నేరుగా సినిమాలో ఆయన్ని అలా చూసి షాకైపోయారు. ఈ ప్రయోగానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఈ చిత్రం మంచి లాభాలనే అందించింది. కలంకవల్ సినిమాను మమ్ముట్టి తన సొంత బేనర్ మమ్ముట్టి కంపెనీలో నిర్మించడం విశేషం.
ఐతే ఈ సినిమాను తనే నిర్మించడానికి కారణం ఉందని ఒక ఇంటర్వ్యూలో మమ్ముట్టి తెలిపాడు. తాను విలన్ పాత్ర చేస్తా అంటే ఏ నిర్మాతా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాడని.. అందుకే దర్శకుడు జితిన్ జోస్ ఈ కథ, తన పాత్ర గురించి చెప్పగానే తనే నిర్మించాలని ముందుకు వచ్చానని మమ్ముట్టి తెలిపాడు.
ఈ సినిమా నటుడిగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన చెప్పారు. ఇక రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రోమోలో తమ ఇద్దరిలో ఎవరు హీరో అంటూ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ను అడగడం గురించి ప్రస్తావిస్తూ.. మోహన్ లాల్, మీరు కలిసి ,చేసిన ప్యాట్రియాట్ సినిమాలో ఎవరు హీరో అని దర్శకుడిని అడుగుతారా అని ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. మమ్ముట్టి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
తనతో పాటు మోహన్ లాల్కూ ఈ సినిమాలో కథే హీరో అని స్పష్టంగా తెలుసని.. తామిద్దరం కథను మించిన స్టార్లు కామని ఆయన వ్యాఖ్యానించారు. తాను మోహన్ లాల్ సినిమాలు చాలా వాటిలో నటించానని.. అలాగే లాల్ కూడా తన సినిమాల్లో యాక్ట్ చేశాడని.. తమ మధ్య ఎలాంటి ఇగోలు ఉండవని.. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే భావన రానీయమని మమ్ముట్టి స్పష్టం చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates