స్థ‌లం కొని మ‌రిచిపోయిన పూరి జ‌గ‌న్నాథ్‌

ఫిలిం సెల‌బ్రెటీల్లో చాలామంది ఇండ‌స్ట్రీలో సంపాదించే డ‌బ్బుల‌ను భూమి మీద పెట్టుబ‌డిగా పెడుతుంటారు. ఇలా పాత కాలంలో పెట్టుబ‌డులు పెట్టిన వాళ్లు ఇప్పుడు వంద‌ల కోట్ల స్థాయికి చేరుకున్నారు. అలాంటి ఉదాహ‌ర‌ణ‌లు ఇండ‌స్ట్రీలో చాలానే క‌నిపిస్తాయి. ఐతే స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇలా ఆస్తులు సంపాదించి, త‌ర్వాత పోగొట్టుకున్న సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత పుంజుకుని ఒక స్థాయిలో నిల‌బ‌డ్డారు.

ఐతే చాలా ఏళ్ల ముందు హైద‌రాబాద్‌లోని మ‌ణికొండ‌లో ఒక స్థ‌లం కొని, దాని గురించి త‌ర్వాత మ‌రిచిపోయార‌ట పూరి. ఈ విష‌యాన్ని ఆయ‌న‌కు స‌న్నిహితుడైన సంగీత ద‌ర్శ‌కుడు, న‌టుడు ర‌ఘు కుంచె ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

మ‌ణికొండ ఎక్కువ అభివృద్ధి చెంద‌ని రోజుల్లో 500-1000 గ‌జాల మ‌ధ్య పూరి జ‌గ‌న్నాథ్ స్థ‌లం కొన్నార‌ని.. కానీ త‌ర్వాత అది ఎక్క‌డుందో కూడా మ‌రిచిపోయార‌ని ర‌ఘు తెలిపాడు.
తాను, పూరి క‌లిసి ఒక సంద‌ర్భంలో ఆ స్థలం ఎక్క‌డుందో చూద్దామ‌ని వెళ్తే.. అక్క‌డ మారిన ప‌రిస్థితుల వ‌ల్ల అదెక్క‌డుందో అర్థం కాలేద‌ని ర‌ఘు తెలిపాడు.

తాము మ‌ణికొండ‌కు వెళ్లి వెతుకుతూ ఉంటే.. ఒక చోట రాజ‌మౌళి, కీర‌వాణి క‌నిపించార‌ని.. వాళ్లు కూడా అక్క‌డ స్థ‌లం కొన్నార‌ని.. అప్పుడు పూరి స్థ‌లాన్ని కూడా వాళ్లే గుర్తించి ఫ‌లానా చోట ఉంద‌ని చూపించార‌ని ర‌ఘు తెలిపాడు. ఇక త‌న ఆర్థిక ప‌రిస్థితి గురించి చెబుతూ.. త‌న‌కు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి డ‌బ్బుకు లోటు లేద‌ని.. యాంక‌ర్ల‌లో కారు కొన్న, అపార్ట్‌మెంట్ ఫ్లాట్ కొనుక్కున్న‌ తొలి వ్య‌క్తిని తానే అని ర‌ఘు తెలిపాడు.

సింగ‌ర్‌గా ఉన్నా, సంగీత దర్శ‌కుడు అయినా, న‌టుడిగా మారినా.. త‌న‌కు అవకాశాల‌కు లోటు లేక‌పోయింద‌ని.. డ‌బ్బులు కూడా కోరుకున్నంత వ‌చ్చాయ‌ని.. దేవుడు చేసిన మ‌నుషులు చిత్రానికి అప్ప‌ట్లోనే రూ.45 ల‌క్ష‌లు తీసుకున్నాన‌ని.. అది అప్ప‌ట్లో టాలీవుడ్లో ఒక మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు ద‌క్కిన సెకండ్ హైయెస్ట్ రెమ్యూన‌రేష‌ణ్ అని ర‌ఘు కుంచె తెలిపాడు. ఐతే త‌న‌కు విలాస‌వంతంగా బ‌త‌క‌డం ఇష్టం కావ‌డంతో.. డ‌బ్బుల‌తో భూములు కొనాలి అనుకోలేద‌ని.. అందువ‌ల్ల ఆస్తులు పెర‌గ‌లేద‌ని ర‌ఘు చెప్పాడు.