క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా థియేటర్ లెక్కల్లో అద్భుతాలు చేయలేదన్నది వాస్తవం. ఇదే నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సైతం ఇదే సమస్యతో ఒరిజినల్ తమిళ వెర్షన్ అంత విజయం సాధించలేకపోయింది. అందుకే స్టార్ హీరోలు వీటి జోలికి వెళ్లేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి స్పోర్ట్స్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
గతంలో గని రూపంలో బాక్సింగ్ ఆటను ఆడి బాక్సాఫీస్ దగ్గర ఓడిపోయిన వరుణ్ తేజ్ దాని కోసం ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ జోలికి వెళ్ళలేదు. తాజాగా కమిటీ కుర్రాళ్ళు ఫేమ్ యుదు వంశీ చెప్పిన కథ వరుణ్ కి బాగా నచ్చిందట. వాలీ బాల్ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్ రెండూ మిక్స్ చేసి బ్యాలన్స్ గా రాసుకున్న తీరు నిర్మాత కం వరుణ్ తేజ్ చెల్లెలు నీహారిక కొణిదెలకు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మాములుగా వాలీ బాల్ గొప్ప ఆటే కానీ తెలుగు రాష్ట్రాల్లో దానికి ఆదరణ మరీ ఎక్కువ లేదు. కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చి చదువులు, పరీక్షలు అంటూ పిల్లలకు ఈ రెండే లోకంగా మారిపోయాక క్రికెట్ తప్ప వేరే గేమ్ గురించి ఆలోచించే ఓపిక లేకపోయింది. కొన్ని సినిమాల్లో ఒకటి రెండు సన్నివేశాల్లో వాలీ బాల్ చూపించిన దాఖలాలు ఉన్నాయి కానీ సినిమా మొత్తం దాన్నే చూపించిన దర్శకులు లేరు. సో యదు వంశీ ఏదో కొత్త ప్రయోగం చేయబోతున్నాడన్న మాట.
నిజానికి ఈ యదు వంశీ చిరంజీవి కోసం ఒక సబ్జెక్టు రాశారట. నీహారిక రిఫరెన్స్ తో వినిపించడం కూడా జరిగింది. కానీ మెగాస్టార్ ని ఫైనల్ నెరేషన్ తో ఒప్పించడంలో కుర్రాడు తడబడటంతో ఆ ఛాన్స్ కాస్తా వరుణ్ తేజ్ అందుకున్నట్టు తెలిసింది. అయితే రెండు వేర్వేరు కథలని మెగా కాంపౌండ్ టాక్. కొరియన్ కనకరాజు విడుదల కోసం వెయిట్ చేస్తున్న వరుణ్ తేజ్ తన డిజాస్టర్ల పర్వానికి ఈ సినిమా శుభం కార్డు పలుకుతుందనే నమ్మకంతో ఉన్నారు. త్వరలోనే డేట్ అనౌన్స్ చేస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates