ఉస్తాద్ రీమేక్ గోల ఆపుతారా?

రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక..  వరుసగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో.. ఈ మూడూ వేర్వేరు భాషల నుంచి అరువు తెచ్చుకున్న కథలే. ఐతే ఈ రీమేక్ పరంపరకు గత ఏడాది బ్రేక్ పడింది.

స్ట్రెయిట్ సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీలతో ప్రేక్షకులను పలకరించాడు. ఐతే పవన్ తర్వాతి చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ స్ట్రెయిట్ మూవీనా, రీమేకా అనే విషయంలో ఎంతో సందిగ్ధత నడిచింది. ఇది తమిళ బ్లాక్ బస్టర్ ‘తెరి’కి రీమేక్ అనే అభిప్రాయంతోనే మొదట్నుంచి అందరూ ఉన్నారు ఫాన్స్.

మొదట్లో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కానీ రిలీజ్ దగ్గర పడుతుండగా ‘ఉస్తాద్..’ రీమేక్ కానే కాదంటూ నొక్కి వక్కాణించాడు. రీమేక్ అయితే ‘కథ-మాటలు-దర్శకత్వం’ అని కార్డ్ ఎందుకు వేసుకుంటా అని ఆయన అన్నా సరే.. బుక్ మై షోలో ‘ఉస్తాద్’ సినాప్సిస్ లో తెరి కథను పెట్టేయడంతో మళ్ళీ కన్ఫ్యూజన్ తప్పలేదు. బుక్ మై షోలో సినాప్సిస్ మార్చినా సరే.. పవన్ అభిమానుల్లో ఏదో ఒక మూల అనుమానం లేకపోలేదు.

ఐతే ఇప్పుడు ఉస్తాద్ ట్రైలర్ బయటికి రావడంతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం రీమేక్ అనే విషయంలో పూర్తిగా అనుమానాలు తొలగిపోయాయి. ట్రైలర్లో తెరి ఛాయలు ఏమి కనిపించలేదు. ముఖ్యంగా హీరోకు ఫ్లాష్ బ్యాక్, ఒక కూతురు, డిఫరెంట్ గెటప్.. ఈ సెటప్ ఏది ఇందులో కనిపించలేదు. సినిమా కోసం దాన్ని దాచి ఉండొచ్చనే సంకేతాలు కూడా ఏమి లేవు.

పవన్ క్యారెక్టర్ పూర్తి ఎంటర్టైనింగ్ గా ఉండబోతోందని.. తెరి తరహాలో ఎమోషనల్ టచ్ ఏమి ఉండే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఇది రీమేక్ అని భయపడాల్సిన పనిలేదు. కానీ ఫాంలో లేని హరీష్ తన సొంత కథతో ఏ మేర మెప్పిస్తాడనే విషయంలోనే ఇక భయపడాలి.

ఈ చిత్రానికి కథ, మాటలు హరీష్ రాయగా.. దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా నటించారు. రాబోయే గురువారం ఉగాది కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.