అసలే బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’కు డీసెంట్ టాక్ ఉన్నప్పటికీ బిసి సెంటర్లలో ఆశించిన స్థాయిలో పికప్, వసూళ్లు లేవు. ఉన్నంతలో నగరాలు, పట్టణాల్లో కొంచెం మెరుగ్గా ఉంది. శివాజీ ‘సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూస’ ఫస్ట్ షోకే ఫలితం తేలిపోగా ‘మెన్షన్ హౌస్ మల్లేష్’కు సోషల్ మీడియా హడావిడి తప్ప గ్రౌండ్ లెవెల్ లో చెప్పుకునేంత సౌండ్ లేదు. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్ట్ చేసిన ఎస్ సరస్వతికి కాసిన్ని ప్రశంసలు వినిపించాయి కానీ అవి వసూళ్లుగా మారుతున్న వైనం కనిపించడం లేదు.
గత వారం వచ్చిన విష్ణు విన్యాసం వీక్ డేస్ లోనే పూర్తిగా నెమ్మదించేసింది. సరే ఈ రోజు ఆదివారం వీకెండ్ అన్ని సినిమాలకు ఏమైనా కాస్త తెరిపి దక్కి కలెక్షన్లు వస్తాయనుకుంటే క్రికెట్ రూపంలో దెబ్బ పడింది. ఐసిసి మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య జరగనుంది. సాయంత్రం అయిదు నుంచే హడావిడి ఉంటుంది. జనాలు బాగా ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు.
చాలా చోట్ల మల్టీప్లెక్సుల్లో లైవ్ మ్యాచ్ ని ప్రదర్శించబోతున్నారు. రెగ్యులర్ టికెట్ ధరలే పెట్టడంతో టికెట్లు వేగంగా అమ్ముడుపోతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 30 వేల టికెట్లు బుక్ మై షోలో అమ్మడం కొత్త రికార్డు. అంటే వర్కౌట్ కాని సినిమాలను భరించడం కన్నా ఇష్టమైన క్రికెట్ ని బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయొచ్చని ఆడియన్స్ భావిస్తున్నారు.
ఆ కారణంగానే విజయవాడ లాంటి చోట్ల నాలుగైదు క్రికెట్ షోలు వేసినా వేగంగా ఫుల్స్ పడుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో ఎగ్జిబిటర్ల కళ్లన్నీ మార్చి 19 మీద ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, దురంధర్ ది రివెంజ్ రెండు ఒకే రోజు రానుండటంతో మళ్ళీ థియేటర్లు ప్రేక్షకులతో హౌస్ ఫుల్ బోర్డులతో నిండుగా కళకళలాడతాయని ఎదురు చూస్తున్నారు.
ముందు రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లు ఉంటాయి కాబట్టి హడావిడి అప్పటి నుంచే మొదలవుతుంది. అందాక ఈ నిర్లిప్తతను తట్టుకోక తప్పదు. సంక్రాంతికి ఒకేసారి స్టార్ల సినిమాలన్నీ వచ్చేయడం, తర్వాత విశ్వక్ సేన్ లాంటి నోటబుల్ హీరోలున్న చిత్రాలు ఫ్లాప్ కావడం ఈ పరిస్థితి కారణమని చెప్పొచ్చు. ఉన్నంతలో కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కొంత బండిని లాగాయి కానీ లేదంటే ఇంకా తీవ్రంగా ఉండేది.
Gulte Telugu Telugu Political and Movie News Updates