లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది. మగధీర, ఈగ, బాహుబలి, భజరంగి భాయిజాన్, ఆర్ఆర్ఆర్ లాంటి మెగా బ్లాక్బస్టర్ మూవీస్కు కథ అందించి దేశ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప రచయితల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న విజయేంద్ర..
తాజాగా ఒక ఈవెంట్లో తన తాతలు, ముత్తాతలు చేసిన తప్పుల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు. చాన్నాళ్ల నుంచి తనలో ఒక బాధ గూడుకట్టుకుని ఉందని.. దాని గురించి మాట్లాడదామని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నానని.. ఇప్పుడు దాని గురించి మాట్లాడతానని విజయేంద్ర మొదలుపెట్టారు.
తమది సంపన్న కుటుంబం అని వెల్లడించిన విజయేంద్ర ప్రసాద్.. తనతో పాటు జాన్ ఫ్రెడరిక్ సుందర్ రావు అనే దళిత కులానికి చెందిన కుర్రాడు కలిసి చదువుకున్నాడని.. బ్రిలియంట్ స్టూడెంట్ అయిన అతడికి తన తండ్రి ఆర్థిక సాయం చేశారని గుర్తు చేసుకున్నారు.
ఐతే తన తాతలు, ముత్తాతలు మాత్రం వర్ణ వివక్షతో అనేక పాపాలు చేశారని ఆయనన్నారు. నోటితో చెప్పుకోలేని తప్పులు, పాపాలు వారి కాలంలో జరిగాయని.. వాటి విషయంలో తాను ఎంతో బాధ పడుతున్నానని విజయేంద్ర చెప్పారు.
తాను ఆ పాపాల నుంచి దూరం జరగాలని అనుకోవట్లేదని.. వాటికి బాధ్యత వహించాలని అనుకుంటున్నానని.. ఎందుకంటే తన తాత ముత్తాతల ఆస్తులను తాను, తన కుటుంబ సభ్యులు అనుభవించారని ఆయన చెప్పారు.
కాబట్టి ఆ పాపాలన్నింటికీ క్షమాపణ చెబుతున్నా అంటూ.. తలవంచి ఐదారుసార్లు క్షమాపణలు చెప్పారు విజయేంద్ర. ఈ సందర్భంగా గద్గద స్వరంతో మాట్లాడారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఇంతగా ఎమోషనల్ అవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయేంద్ర నుంచి ఊహించని ఈ చర్యతో సభికులందరూ ఆశ్చర్యపోతూ, ఆయన సంస్కారానికి చప్పట్లతో అభినందనలు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates