మరుదనాయగం.. హీరోను మార్చాలంటున్న కమల్

కమల్ హాసన్ కలల సినిమా ‘మరుదనాయగం’ గురించి ఒకప్పుడు పెద్ద చర్చే నడిచింది. 90ల చివర్లో క్వీన్ ఎలిజబెత్‌-2ను ఇండియాకు రప్పించి ఆమె చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిపించి.. ఆ తర్వాత కొంత కాలం షూటింగ్ చేసి.. మధ్యలో బడ్జెట్ సమస్యలతో ఆపేశాడు కమల్ హాసన్.

ఆ తర్వాత ఆ సినిమాను మళ్లీ మొదలుపెడతానని.. పూర్తి చేస్తానని చాలాసార్లు చెప్పాడు కమల్. చూస్తుండగానే రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. అప్పటికి ఇప్పటికి కమల్ హాసన్‌లో చాలా మార్పు వచ్చేసింది. అప్పట్లోనే రూ.100 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీయడానికి ప్రణాళికలు వేశాడు కమల్. ఇప్పుడైతే ఆయన కలలకు రూపం ఇవ్వడానికి రూ.500 కోట్లు పడుతుందేమో. సినిమా మొదలైన నాటితో పోలిస్తే కమల్ రూపం మారిపోయింది. కాబట్టి ఇంతకుముందు పెట్టిన ఖర్చు, చిత్రీకరించిన సన్నివేశాలు ఎందుకూ పనికిరావు.

దీంతో ఇక ఎప్పటికీ ఈ సినిమా ముందుకు కదలదనే అనుకుంటున్నారు అందరూ. కమల్ కూడా చాలా ఏళ్లుగా ఈ సినిమా గురించి మాట్లాడట్లేదు. ఐతే తాజాగా విజయ్ సేతుపతితో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానులతో మాట్లాడిన కమల్ ‘మరుదనాయగం’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఓ అభిమాని ఆ సినిమా సంగతేంటని అడిగితే.. ఈ పరిస్థితుల్లో దాన్ని తీయడం కష్టమే అన్నాడు కమల్. తాను 40 ఏళ్ల వ్యక్తిగా ఆ సినిమా కథ రాయడం మొదలుపెట్టానని.. సినిమాలో కథానాయకుడి పాత్ర కూడా ఆ వయసుతోనే ఉంటుందని.. కానీ ఇప్పుడు తన వయసు పెరిగిపోయింది కాబట్టి ఆ కథకు సరిపోనని అన్నాడు కమల్.

తానే ఆ సినిమా చేయాలంటే కథ మార్చాల్సి ఉంటుందని.. అలా కాకుండా ఉన్న స్క్రిప్టుతోనే సినిమా చేయాలంటే తన స్థానంలో మరో హీరోను తీసుకోవాల్సి ఉంటుందని అన్నాడు కమల్. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా పున:ప్రారంభమవుతుందని తాను భావించట్లేదని కమల్ తేల్చేశాడు.