నటి ప్రత్యూష మృతి కేసు.. తేల్చేసిన సుప్రీం

రెండు దశాబ్దాల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీం కోర్టు మంగళవారం తుది తీర్పును వెలువరించంది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను నిందితుడు సిద్దార్థ రెడ్డి సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. నిందితుడికి హైకోర్టు విధించిన శిక్షను సమర్థించిన సుప్రీం కోర్టు.. సిద్దార్థ రెడ్డిని నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రత్యూష కేసును విచారించిన సీబీఐ.. నిందితుడిపై ఆత్మహత్యకు ప్రయత్నించి, ఆత్మహత్యకు పురిగొల్పిన సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలుచేసింది. ముందుగా హైదరాబాద్ మెట్రోపాలిటిన్ కోర్టు సిద్దార్థకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై సిద్దార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానా విధించింది.

ఐతే ఈ తీర్పును కూడా సవాలు చేస్తూ సిద్దార్థ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యూష 2000 ప్రాంతంలో తెలుగు సినిమాల్లోకి దూసుకొచ్చింది. రాయుడు, కలుసుకోవాలని లాంటి చిత్రాల్లో నటించింది. ఇంటర్ చదువుతున్నపుడే ఆమె సిద్దార్థ రెడ్డితో ప్రేమలో పడింది.

ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా.. సిద్దార్థ రెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. ఐతే 2002లో ఫిబ్రవరి 23న రాత్రి విషం తాగిన స్థితిలో ప్రత్యూష, సిద్దార్థ ఆసుపత్రిలో చేరారు. ఐతే తర్వాతి రోజు ప్రత్యూష చనిపోగా.. సిద్దార్థ ప్రాణాలతో బయటపడ్డాడు. రెండు వారాల తర్వాత అతను డిశ్చార్జి అయ్యాడు. వాళ్లిద్దరూ కూల్ డ్రింకులో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు తేలింది.

ఐతే ప్రత్యూషది సాధారణ ఆత్మహత్యే అని.. ఆమెపై అంతకుముందు లైంగిక దాడి ఏమీ జరగలేదని వైద్యుల బృందం నిర్ధారించింది. ఐతే ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పినందుకు సిద్దార్థను నిందితుడిగా పరిగణించి అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. అప్పట్లో సంచలనంరేపిన ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.