ఉదయ్ కిరణ్‌కు ‘అత్తారింటికి దారేది’ నచ్చి…

ఉదయ్ కిరణ్.. ఈ పేరు వినగానే నిన్నటితరం తెలుగు ప్రేక్షకుల గుండెలు బరువెక్కుతాయి. కెరీర్ ఆరంభంలో చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో తిరుగులేని విజయాలందుకుని వైభవం చూసిన అతను.. ఆ తర్వాత సరైన సినిమాలు పడక ఫేడవుట్ అయిపోవడం, చివరికి అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడడం అతణ్ని అభిమానించే వారి మనసులను ఛిద్రం చేసింది. తనతో సాన్నిహిత్యం ఉన్న సినీ ప్రముఖులు చాలామంది ఉదయ్ గురించి ఇంటర్వ్య్యూలో చాలా బాధ పడుతూ మాట్లాడుతుంటారు. 

ఉదయ్‌‌కి ‘మనసంతా నువ్వే’తో మరపురాని విజయాన్నందించిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య.. ఈ సినిమా వేలంటైన్స్ డే కానుకగా రీ రిలీజ్ అయిన నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన గురించి మాట్లాడాడు. ఉదయ్‌ని ఎంతో ఇష్టపడ్డ తాను.. ఆత్మహత్యకు పాల్పడ్డందుకు జీవితాంతం ద్వేషిస్తానని.. తనను ఎప్పటికీ క్షమించలేనంటూ చాలా ఉద్వేగంతో మాట్లాడిన ఆదిత్య.. చివరగా ఉదయ్‌కి, తనకు జరిగిన ఫోన్ కాల్ వివరాలు పంచుకున్నాడు.

ఆత్మహత్యకు పాల్పడడానికి ఆరు రోజుల ముందు ఆదిత్యకు కాల్ చేసిన ఉదయ్ కిరణ్.. కొన్ని గంటల పాటు చాలా హుషారుగా మాట్లాడాడట. అప్పుడే ‘అత్తారింటికి దారేది’ సినిమా రిలీజై ఇండస్ట్రీ హిట్ అయిందని..

పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరో అలాంటి ఫ్యామిలీ సినిమా చేసి అంత పెద్ద హిట్ కొట్టడం చూసి ఉదయ్ ఆశ్చర్యపోయాడని.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నది మన జానర్ కదా అని చెప్పి, అలాంటి కథ రాయి మనం సినిమా చేసేద్దాం అని హుషారుగా మాట్లాడాడని ఆదిత్య తెలిపాడు. ఐతే తన ఇమేజ్‌కు భిన్నంగా ‘జై శ్రీరాం’ లాంటి సినిమా చేయడం ఉదయ్ చేసిన తప్పని ఆదిత్య అభిప్రాయపడ్డాడు. 

వరుస హిట్లతో గొప్ప స్టార్ ఇమేజ్ సంపాదించినా.. ఉదయ్ చాలా అణకువతో ఉండేవాడని, అందరితో కలిసిపోయేవాడని.. సక్సెస్‌లో ఉన్నపుడు తనను తాను నియంత్రించుకుని అంత హంబుల్‌గా ఉన్న వ్యక్తి.. ఫెయిల్యూర్లోకి వెళ్లినపుడు దాన్ని డీల్ చేయలేక ఆత్మహత్యకు పాల్పడడమే ఆశ్చర్యం అని.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి రాణించాలని అనుకునేవాళ్లలో భయాన్ని నింపాడని, ఒక బ్యాడ్ ఎంగ్జాపుల్‌గా నిలిచాడని.. ఇందుకు అతణ్ని తాను క్షమించలేనని.. జీవితాంతం ద్వేషిస్తూనే ఉంటానని అన్నారు ఆదిత్య.