ఫీడ్ బ్యాక్ విశ్లేషణలో స్వయంభు బిజీ

నిన్న నిఖిల్ సిద్దార్థ స్వయంభు రెండు నిమిషాల టీజర్ వచ్చాక సోషల్ మీడియా రియాక్షన్లు అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం నిఖిల్ రెండు సంవత్సరాలకు పైగా సమయాన్ని ఖర్చు పెట్టాడు. మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా వాటిని హోల్డ్ లో పెట్టి పూర్తిగా దీనికే అంకితమైపోయాడు.

దర్శకుడు భరత్ కృష్ణమాచారి మీద నమ్మకంతో శారీరకంగానూ ఎంతో శ్రమ తీసుకున్నాడు. అయితే నెటిజెన్లలో కొందరికి బాహుబలి షేడ్స్ కనిపించడం, ఎడిటింగ్ లో జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల కథ గురించి అవగాహన ఇంకోలా రావడం తదితర పరిణామాలు కొంచెం మిక్స్డ్ రియాక్షన్స్ తీసుకొచ్చాయి.

విజువల్ గ్రాండియర్ నెస్ కి ఎలాంటి లోటు లేకపోయినా మరీ శల్యపరీక్ష చేసే బ్యాచులు ఎక్స్, ఇన్స్ టాలో బోలెడు ఉన్నాయి కాబట్టి అవి ఏమేం చెప్పాయనే దాని మీద స్వయంభు టీమ్ విశ్లేషణ చేస్తోందట. ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకుండా రాబోయే ప్రమోషన్ మెటీరియల్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవి ఉపయోగపడతాయి కాబట్టి, దానికి అనుగుణంగా వాటిని పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు.

సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ ఎపిక్ డ్రామా రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయితేనే సీక్వెల్ కు సరిపడా హైప్ నెలకొంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండక తప్పదు.

కార్తికేయ 2 ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించాక మళ్ళీ దాన్ని నిలబెట్టే సినిమా నిఖిల్ నుంచి రాలేదు. అందుకే స్వయంభు విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందరూ అనుకున్నట్టు ఇది కల్పిత కథ కాదట. నిజంగా జరిగిన దాన్ని ఇతిహాసాల నుంచి తీసుకుని స్క్రిప్ట్ రాసుకున్నారు.

యుద్ధ వీరుడిగా నిఖిల్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. తన మార్కెట్, ఇమేజ్ కి మించి పెద్ద రిస్క్ చేశాడు కాబట్టి దానికి అనుగుణంగా ఫలితం రావాలంటే యునానిమస్ బ్లాక్ బస్టర్ సాధించాలి. టీమ్ అయితే ఆ నమ్మకంతోనే ఉంది. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న స్వయంభుకి పబ్లిసిటీని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.