సాయిశ్రీనివాస డిస్కషన్ ఇప్పుడు ఎందుకు

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సీక్వెల్ కావాలనే డిమాండ్ పెరిగిపోయింది. అనగనగా ఒక రోజు ప్రమోషన్ల కోసం నవీన్ పోలిశెట్టి అమెరికా వెళ్లినప్పుడు అక్కడి ఆడియన్స్ కొందరు ఈ కోరికను థియేటర్లో నేరుగా వినిపించారు. ఆ క్లిప్ కాస్త వైరల్ కావడంతో ఇక్కడి ఫ్యాన్స్ యాక్టివేట్ అయిపోయి పార్ట్ 2 పల్లవి అందుకున్నారు.

మొదటి భాగం తీసిన దర్శకుడు స్వరూప్ ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డతో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ కింద వేరే మూవీ చేస్తున్నారు. ఎప్పుడో అఫీషియల్ కాగా ఇవాళ సిద్ధూ పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది పూర్తిగా వేరే జానర్ అండ్ స్టోరీ.

పైగా ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ నిర్మాతలు దాని కొనసాగింపుకి ఇప్పుడప్పుడే సుముఖంగా లేరు. అందులోనూ బాహుబలి, పుష్ప, కెజిఎఫ్ లాగా ఇదేమి క్లైమాక్స్ లో మలుపులు పెట్టి కంటిన్యూటి కోసం ఎదురు చూసేలా చేయలేదు. ట్విస్టుని రివీల్ చేసి కథని అక్కడితో క్లోజ్ చేశారు.

డిటెక్టివ్ కథ కాబట్టి మళ్ళీ ఇంకో క్రైమ్ చుట్టూ అల్లుకోవచ్చు. కానీ నవీన్ సన్నిహితుల టాక్ ప్రకారం అతనికి ఈ సీక్వెల్స్ మీద ఆసక్తి లేదట. గతంలో జాతిరత్నాలు 2ని అమెరికా బ్యాక్ డ్రాప్ లో తీస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్ స్వప్న సినిమా బృందంలో జరిగిందట. అనుదీప్ కూడా ఇంటరెస్ట్ చూపించాడు. కానీ కార్యరూపం దాల్చలేదు.

సో ఇప్పుడు ఏజెంట్ విషయంలోనూ నవీన్ పోలిశెట్టి ఇదే నిర్ణయంలో ఉండొచ్చు. వరసగా మూడు బ్లాక్ బస్టర్స్ కొట్టాక నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడనే దాని మీద ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం రెండు కథలు చివరి దశలో ఉన్నాయి. ఫైనల్ నెరేషన్ సంతృఫికరంగా అనిపిస్తే సెట్స్ పైకి తీసుకెళ్తారు. అప్పటిదాకా వెయిటింగ్ తప్పదు.

ఊరికే ట్విట్టర్, ఇన్స్ టాలో హడావిడి చేయడం తప్ప సాయిశ్రీనివాస ఆత్రేయ గురించిన ప్రచారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. పైగా బిగ్ లీగ్ లోకి ప్రవేశించాలని చూస్తున్న నవీన్ పోలిశెట్టి ఈసారి ఎంటర్ టైన్మెంట్ కాకుండా సీరియస్ జానర్ వైపు చూస్తున్నాడని వినికిడి.