వరప్రసాద్ గారు కాస్త ఊపిరినిచ్చారు

సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది. పండగ మూడ్ నుంచి బయటికి వచ్చిన ప్రేక్షకులు, సెలవులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎవరికి వారు బిజీ కావడంతో థియేటర్లు క్రమంగా బోసి పోవడం మొదలయ్యాయి.

అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి లాంటి హిట్లు సైతం ఎదురీదక తప్పని పరిస్థితి నెలకొంది. నిన్నా మొన్న కొత్త వీకెండ్ కాస్త తెరిపినిచ్చింది. గత ఇరవై నాలుగు గంటల్లో చిరంజీవి మూవీకి బుక్ మై షోలో నలభై వేల దాకా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోగా నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ కూడా మంచి నెంబర్లు నమోదు చేశారు.

ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల మన శంకరవరప్రసాద్ గారుకి అదనపు స్క్రీన్లు జోడించారు. ఇవాళ్టి నుంచి పరిస్థితి మళ్ళీ మొదటికే రానుంది. హాళ్లు తిరిగి ఖాళీ కాబోతున్నాయి. కొత్తగా రిలీజైన వాటిలో అంతో ఇంతో బజ్ ఉన్న ఓం శాంతి శాంతి జనాలను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో మరోసారి డ్రై వీక్ ఎదురయ్యింది.

ఇక సంక్రాంతి సినిమాలకు చివరి ఓవర్ అయ్యిందని చెప్పాలి. నారి నారి నడుమ మురారి ఫిబ్రవరి 4, రాజా సాబ్ ఫిబ్రవరి 6, మన శంకరవరప్రసాద్ గారు ఫిబ్రవరి 11, అనగనగా ఒక రాజు ఫిబ్రవరి 13 ఓటిటిలో రావడం దాదాపు ఖరారట. మొదటి రెండు సినిమాల అనౌన్స్ మెంట్స్ అఫీషియల్ గా వచ్చేశాయి కూడా.

ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి డేట్ ఒకటి తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 14 నుంచి తిరిగి కొత్త సినిమాల హడావిడి మొదలు కానుంది. కాకపోతే టయర్ 1, 2 లీగ్ లో ఉన్న హీరోల రిలీజులేవి లేకపోవడం బయ్యర్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. కనీసం వారం పది రోజులు హౌస్ ఫుల్స్ చేయించే హిట్టొకటి పడాలని కోరుకుంటున్నారు కానీ అది ఎంత మేరకు సాధ్యమవుతుందో చూడాలి.

విశ్వక్ సేన్, సంతోష్ శోభన్ లాంటి వాళ్ళు తమ కంటెంట్ తో యునానిమస్ టాక్ తెచ్చుకుంటే తిరిగి టికెట్ కౌంటర్లకు జోష్ తెప్పించవచ్చు. ఆయా యూనిట్లు ప్రమోషన్ల వేగాన్ని పెంచే పనిలో బిజీగా ఉన్నాయి. చూడాలి ఎవరు గెలుస్తారో.