ఓటీటీ హీరో… థియేటర్ హీరో అయ్యాడు

లెజెండరీ నటుడు సాయికుమార్ వారసత్వాన్నందుకుంటూ సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆది సాయికుమార్‌కు కెరీర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి మంచి సినిమాలే పడ్డాయి. కానీ తర్వాత అతడికి కలిసి రాలేదు. వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. ఆది ఎంతగా వెనుకబడ్డాడంటే.. ఒక దశ దాటాక తన సినిమాలు థియేటర్లలో రిలీజవడమే గగనం అయిపోయింది. ఒకవేళ రిలీజైనా జనం పట్టించుకోవడమూ మానేశారు. 

ఐతే విశేషం ఏంటంటే.. తన సినిమాలకు ఓటీటీల్లో మంచి స్పందన వస్తోంది చాలా ఏళ్లుగా. తెలుగుతో పాటు వేరే భాషల వాళ్లూ తన సినిమాలు చూస్తున్నారు. థియేటర్లలో అసలేమాత్రం ప్రభావం చూపని చిత్రాలకు మంచి రేటు ఇచ్చి తీసుకున్నాయి ఓటీటీ సంస్థలు. డిజిటల్ బిజినెస్ బాగా డల్ అయ్యాక కూడా ఆది సినిమాలు మాత్రం అక్కడ మంచి రేటుకు సేల్ కావడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.

ఐతే ఓటీటీలో ఎంత డిమాండ్ ఉన్నా సరే.. థియేటర్లలో సినిమా ఆడితేనే ఒక హీరోకు విలువ. ఆ సక్సెస్ కోసమే ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నాడు ఆది. అతను ‘శంబాల’ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. కొడుకు విజయం కోసం ఎదురు చూస్తున్న సాయికుమార్ సైతం ఈ సినిమా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వీళ్లిద్దరి నమ్మకం నిలబడి ‘శంబాల’ బాక్సాఫీస్ దగ్గర విజేతగా నిలిచింది. ఆది గత చిత్రాలను అస్సలు పట్టించుకోని ఆడియన్స్.. ప్రోమోలు బాగుండడంతో ‘శంబాల’ పట్ల ఆసక్తిని ప్రదర్శించారు. సినిమాకు టాక్ కూడా డీసెంట్ గా వచ్చింది.

దీంతో క్రిస్మస్ సెలవులను సినిమా బాగా ఉపయోగించుకుంది. మంచి వసూళ్లతో సాగింది. వీకెండ్లోనే చాలా ఏరియాల్లో ‘బ్రేక్ ఈవెన్’కు వచ్చేసింది ‘శంబాల’. వీక్ డేస్‌లో కూడా ఓ మోస్తరుగా పెర్ఫామ్ చేస్తోంది. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు సినిమా థియేటర్లలో బాగానే నిలబడేలా ఉంది. మొత్తానికి ఇన్ని రోజులు ఓటీటీ హీరోగా ఉన్న ఆది.. ‘శంబాల’తో మళ్లీ థియేటర్ హీరోగా నిలబడుతుండడంతో తన కుటుంబానికి అమితానందాన్నిచ్చేదే.