సిద్ధూ నిర్ణయాలు ఎందుకు మారుతున్నాయ్

టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డతో సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ కోహినూర్. కాన్సెప్ట్ పోస్టర్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. కానీ జాక్ ఫలితం రివర్స్ చేసింది. అది దారుణంగా డిజాస్టర్ కావడంతో నిర్ణయం మారిపోయి కోహినూర్ స్థానంలో బ్యాడ్ యాస్ వచ్చింది.

ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో తండ్రి కొడుకుల ఎమోషన్ ని కొత్తగా చూపిస్తామని టీమ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు దీని ప్లేస్ లో ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ దర్శకత్వంలో వేరే సబ్జెక్టు ఫైనల్ చేశారని టాక్. ఇవన్నీ ఆశ్చర్యకరంగా సితార బ్యానర్ లోనే జరిగిన మార్పులు చేర్పులు.

అసలు సిద్దు డెసిషన్లు ఎందుకు మారిపోతున్నాయనే సందేహం రావడం సహజం. మొన్నటిదాకా సిద్దు అంటే ఒక బ్రాండ్. మినిమమ్ గ్యారెంటీ ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఇండస్ట్రీలో ఉండేది. కానీ తెలుసు కదా దాన్ని బ్రేక్ చేసింది.

జానర్ పక్కన పెడితే బజ్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా చతికిలబడింది. సిద్దు మార్క్ బాడీ లాంగ్వేజ్ ని దర్శకురాలు నీరజ కోన జొప్పించినా సరే వర్కౌట్ కాలేదు. దీని దెబ్బకు ప్రేక్షకులకు తాను ఎందుకు డిస్ కనెక్ట్ అవుతున్నాడో విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దాని ఫలితమే ఇప్పుడీ పరిణామాలని చెప్పొచ్చు.

పోటీ వాతావరణంలో కన్సిస్టెంట్ గా హిట్లు ఇవ్వకపోతే దాని ప్రభావం నేరుగా మార్కెట్ మీద పడుతుంది. సిద్ధూకి యూత్ లో క్రేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ మరీ అర్జున్ రెడ్డి టైంలో విజయ్ దేవరకొండ ఎంజాయ్ చేసినంత లేదు. ఇప్పటికీ రౌడీ బాయ్ మీద నిర్మాతలు కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. కారణం ఒకటే.

సరైన కంటెంట్ పడితే మొత్తం వెనక్కు తెచ్చే కెపాసిటీ తనకు ఉందనే నమ్మకంతో. లైగర్ పోయినా ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ కు ఓపెనింగ్స్ రావడానికి కారణం అదే. సిద్ధూ ఇంకా ఆ స్టేజికి చేరుకోవాలి. గతంలో నందిని రెడ్డి డైరెక్షన్లో మూవీ వద్దనుకోవడానికి కారణం కూడా ఆమె తీసిన అన్నీ మంచి శకునములే రిజల్ట్ తేడా కొట్టడమే.