చాలా తక్కువ టైంలో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగాడు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్ సినిమాలు అతడికి ఎక్కడ లేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. అతను ప్రవేశపెట్టిన సినిమాటిక్ యూనివర్శ్ కాన్సెప్ట్కు జనాలు ఊగిపోయారు. ఐతే ‘విక్రమ్’తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టాక లోకేష్ అంచనాలను అందుకోలేకపోయాడు.
విజయ్తో తీసిన ‘లియో’.. రజినీకాంత్తో చేసిన ‘కూలీ’ ఒకదాన్ని మించి ఒకటి నిరాశపరిచాయి. ఈ రెండు సినిమాలు చూశాక లోకేష్ ఓవర్ రేటెడ్ డైరెక్టర్ అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపించాయి. తన తర్వాతి సినిమా మీద అంచనాలు తగ్గిపోయాయి. అసలతను కొత్త సినిమా ఎవరితో చేస్తాడో కూడా క్లారిటీ లేదు. అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ అంటూ రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. లోకేష్ నుంచి కూడా ఈ విషయంలో ఏ క్లారిటీ రావట్లేదు.
ఐతే ‘కూలీ’ తర్వాత మీడియాకు అస్సలు దొరకని లోకేష్.. తాజాగా విలేకరులతో మాట్లాడాడు. తన తర్వాతి సినిమా గురించి అడిగితే ఇంకా ఏదీ ఖరారవ్వలేదని చెప్పిన లోకేష్.. తన చివరి చిత్రం ఫలితం గురించి మాట్లాడాడు. ‘కూలీ’ మీద వేలల్లో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయని.. అయినా సరే రజినీ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూశారని చెప్పాడు లోకేష్.
‘కూలీ’ సినిమాకు రూ.500 కోట్ల వసూళ్లు వచ్చాయని నిర్మాత చెప్పారని.. ఇందుకు చాలా సంతోషమని.. ఈ విజయానికి సహకరించిన అందరికీ తన కృతజ్ఞతలని అతనన్నాడు. ‘కూలీ’ సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ను తాను పాజిటివ్గానూ తీసుకుని, తన తర్వాతి సినిమాకు తప్పులు జరగకుండా చూసుకుంటానని లోకేష్ చెప్పాడు.
ఐతే ‘లియో’ రిలీజ్ తర్వాత కూడా లోకేష్ అచ్చంగా ఇవే కామెంట్లు చేశాడు. ‘లియో’కు వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ నుంచి పాఠం నేర్చుకుని, ‘కూలీ’లో అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానన్నాడు. కానీ ‘కూలీ’లో ఇంకా ఎక్కువ తప్పులే దొర్లాయి. మళ్లీ లోకేష్ అవే మాటలు చెబుతుండడంతో ఈసారి అతణ్ని ప్రేక్షకులు నమ్మడం కష్టమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates