టాలెంట్, రూపం అన్నీ ఉన్నా అదృష్టం కలిసిరాక వెనుకబడిపోయిన హీరో ఆది సాయికుమార్ కు బ్రేక్ దొరికినట్టే ఉంది. శంభాల మేకింగ్ నుంచి ప్రమోషన్ దాకా తను పడిన కష్టానికి తగ్గ ఫలితం వచ్చేలా ఉంది. యూనానిమస్ గా అదిరిపోయిందని కాదు కానీ ఉన్నంతలో డీసెంట్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ రాబట్టుకోవడం శుభ సూచకం.
ముఖ్యంగా ట్విస్టులను దర్శకుడు హ్యాండిల్ చేసిన తీరు, ఒక పల్లె ప్రపంచాన్ని హారర్ కు ముడిపెట్టిన విధానం ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ రోజు ఎక్కువ ఆక్యుపెన్సీలు కనిపిస్తున్న సినిమాల్లో ఛాంపియన్ తర్వాత స్థానం శంభాలదే కావడం విశేషం.
ముఖ్యంగా ఆది తండ్రి సాయికుమార్ ఈ సినిమాని చాలా పర్సనల్ గా తీసుకున్నారు. నిర్మాత తాను కాకపోయినా కొడుక్కి హిట్ వచ్చే అవకాశం దీంట్లోనే ఉందని గుర్తించిన ఆయన దగ్గరుండి మరీ పబ్లిసిటీలో భాగమయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ల నుంచి చిన్న వీడియోలు చేసే దాకా వెన్నంటే నడిచారు. ఇప్పుడు దాని రిజల్ట్ కనిపిస్తోంది.
సామజవరగమన, కే ర్యాంప్ సినిమాల నిర్మాత రాజేష్ దండా ఇవాళ ఆదిని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు. ఇంకా దర్శకుడు లాక్ కాలేదు కానీ త్వరలోనే ఈ కలయికలో ఒక ఫన్ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఏదైతేనేం మొత్తానికి డీసెంట్ హిట్ దక్కింది కాబట్టి ఆది సాయికుమార్ ప్లానింగ్ ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడేదో బ్లాక్ బస్టర్ సాధించినట్టు కాదు. మునుపటి వాటికంటే మంచి రిజల్ట్ వచ్చింది అంతే. దీనికన్నా పెద్ద స్థాయికి వెళ్లేలా కథలు కాంబోలు ఎంచుకోవాలి.
ఇప్పటిదాకా ఎంపికలో చేసిన పొరపాట్ల వల్లే ఆది సాయికుమార్ రేసులో వెనుకబడ్డాడు. ఇప్పుడు ఛాన్స్ దొరికింది. త్వరలో ఈటీవీ విన్ నిర్మించిన ఎస్ఐ యుగంధర్ థియేటర్ రిలీజ్ జరుపుకోనుంది. ఇది క్రైమ్ థ్రిల్లర్. బిజినెస్ పరంగా శంబాల ప్రభావం దీని మీద పాజిటివ్ గా పడేలా ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates