హనుమాన్ వచ్చి రెండేళ్లు దాటుతోంది. ఇప్పటిదాకా ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఊసే లేదు. రిషబ్ శెట్టితో జై హనుమాన్ త్వరలోనే మొదలవుతుందని అంటున్నారు తప్ప ఫలానా డేట్, టైం చెప్పడం లేదు. నిర్మాతగా, కథకుడిగా ఇతర ప్రాజెక్టుల్లో బిజీగానే ఉన్న ప్రశాంత్ వర్మ ఇంకోవైపు ప్రభాస్ తో కూడా చేయొచ్చనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది కానీ దాని సంగతీ తేలడం లేదు.
టెస్ట్ షూట్ దాకా వచ్చిన రణ్వీర్ సింగ్ ప్యాన్ ఇండియా మూవీ చేజారిపోయిన సంగతి తెలిసిందే. కారణాలు ఏమైనా ఒక మంచి ఆఫర్ మిస్ అయ్యింది. దురంధర్ సక్సెస్ తో రణ్వీర్ సింగ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడం చూస్తున్నాం.
ఒక బ్లాక్ బస్టర్ సాధించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకునేలా తర్వాతి సినిమాల ప్లానింగ్ ఉండటం అంతే అవసరం. రాజమౌళి అనుసరించేది ఇదే. బాహుబలి 2 షూటింగ్ టైంలోనే ఆర్ఆర్ఆర్ అంకురార్పణ జరిగింది. ఇద్దరు హీరోలను కలిసి చకచకా ఒప్పించి సెట్స్ పైకి వెళ్లిపోయారు.
రిలీజ్ దగ్గరవుతుండగా వారణాసికి బీజం వేశారు. విడుదలకు ఏడాదిన్నర ముందే దీని తాలూకు వైబ్స్ గ్లోబల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ మిస్సవుతున్నది ఇలాంటి ప్రణాళికే. జై హనుమాన్ తెరకెక్కించే పక్షంలో అదెప్పుడనేది ఒక క్లారిటీ ఇస్తే ఇలాంటి డిస్కషన్లు చర్చలోకి రావు. కానీ చేయలేకపోతున్నాడు.
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఆగిపోవడం కూడా ప్రశాంత్ వర్మకి ఒక రకమైన ఇబ్బంది తెచ్చి పెట్టింది. దానికి బాధ్యుడు తను కాకపోయినా చాలా సమయం వృథాగా పోయింది. పైగా కొన్ని నెలల క్రితం ప్రశాంత్ వర్మ మీద హనుమాన్ నిర్మాతలు చేసిన అభియోగం, దానికతను ధీటుగా ఇచ్చిన సమాధానం సదరు సమస్యని పరిష్కరించాయో లేదో ప్రపంచానికి తెలియకుండా పోయింది.
ఒకపక్క హీరోలందరూ రెండు మూడేళ్లు డేట్లు ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు. ఇక ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తోనే ముందుకెళ్లాలి. ఈలోగా రామాయణతో సహా ఆ గాథను ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు వచ్చేలా ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates