సాయికుమార్ పుత్రోత్సాహం ఈసారి తీరుతుందా

క్రిస్మస్ కు విడుదల కాబోతున్న సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటోంది. స్టార్ హీరోలు ఎవరూ లేకపోయినా కంటెంట్ల మధ్య యుద్ధంగా దీని గురించి బయ్యర్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆది సాయికుమార్ శంభాల విడుదలకు ముందే ఓటిటి డీల్ పది కోట్లకు క్లోజ్ చేసుకోవడం గురించి ఇండస్ట్రీలో గట్టిగానే మాట్లాడుకున్నారు. పరిమిత బడ్జెట్ లోనే క్వాలిటీ గ్రాఫిక్స్ తో ఒక విలేజ్ థ్రిల్లర్ రూపొందించిన తీరు మీద ఆడియన్స్ లో అంచనాలు ఉరుగుతున్నాయి. కరెక్ట్ గా కనెక్ట్ అయితే మాత్రం విరూపాక్ష తరహాలో మంచి విజయం అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు.

ఆది తండ్రి సాయికుమారే వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తన తండ్రి గురించి ఆది గర్వంగా చెప్పుకున్నారు తీరు, మొన్నో ఇంటర్వ్యూలో ఆయన గురించి సరిగా సమాధానం చెప్పలేదంటూ, ఇప్పుడు ఇచ్చిన వివరణ ప్రేక్షకుల నుంచి చప్పట్లు అందుకుంది. అసలు హైలైట్ మరొకటి ఉంది. నాన్ స్టాప్ గా గ్రాంథికం తెలుగులో సాయికుమార్ చెప్పిన డైలాగు ఆడియన్స్ నుంచి స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. నాన్నకు ఒకటే టెన్షన్ ఉందని, తనకు పెద్ద హిట్టు దక్కితే చూడాలని ఉందని చెప్పడం గురించి ఆది ఎమోషనల్ గా చెప్పిన మాటలు ఈసారి సక్సెస్ కొడితే బాగుంటుందని అనిపించేలా చేశాయి.

ఛాంపియన్, ఈషా, దండోరా, అనకొండతో పోటీ పడుతున్న శంభాలకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. మూఢ నమ్మకాలు రాజ్యమేలే ఒక గ్రామంలో ఉల్కాపాతం పడి దాని పరిణామాలు తీవ్రంగా మారుతున్న టైంలో దెయ్యాలంటే నమ్మకం లేని ఒక యువకుడు వస్తాడు. ఆపై జరిగే పరిణామాలతో ఈ స్టోరీ రాసుకున్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. కాంపిటీషన్ సంగతి ఎలా ఉన్నా అవతల పోటీలో ఉన్నది అందరూ యూత్ బ్యాచే కాబట్టి శంభాల కనక బాగుందనే మాటా తెచ్చుకుంటే ఒక ఇమేజ్ ఉన్న నటుడిగా ఆది సాయికుమార్ కు ఎక్కుడ ఎడ్జ్ దొరుకుతుంది. చూడాలి మరి ఏం చేయనున్నాడో.