గత వారం విడుదలైన దురంధర్ స్టడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 లాంటి క్రేజీ రిలీజ్ ఉన్నా సరే మెయిన్ సెంటర్స్ లో కొన్ని షోలు కొనసాగిస్తున్నారంటే ఎంత పాజిటివ్ గా జనంలోకి దూసుకెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. రెండు వందల కోట్లకు దగ్గరగా ఉన్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదివారం లోపే ఆ లాంఛనం పూర్తి చేసుకునేలా ఉంది. అయితే దురంధర్ పలు విషయాల్లో పలు వర్గాల్లో పెద్ద దెబ్బే కొట్టింది. ఉద్దేశపూర్వకంగా కొందరు ఇచ్చిన వీడియో రివ్యూలను నెటిజెన్లు రివర్స్ ఎటాక్ చేసి తీయించేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కాస్తా ముదిరి సోషల్ మీడియాలో డిబేట్ల దాకా వెళ్ళింది.
ఇంకో వైపు స్పై మూవీస్ అంటే గూఢచారులు నమ్మశక్యం కానీ స్టంట్లు చేస్తారని ఏక్ ధా టైగర్, టైగర్ జిందా హై, వార్, వార్ 2 లాంటి సినిమాలతో చూపించిన యష్ రాజ్ ఫిలింస్ ట్రెండ్ కి భిన్నంగా దర్శకుడు ఆదిత్య ధార్ అత్యంత సహజంగా దురంధర్ ని తెరకెక్కించిన విధానం ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఆడియన్స్ నుంచి దక్కుతున్న మద్దతు అనూహ్యం. ఈ లిస్టులో సెలబ్రిటీలు కూడా చేరుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఏఎంబిలో షో చూసి ఒక సుదీర్ఘమైన ట్వీట్ పెట్టాడు. అందరికీ శుభాకాంక్షలు చెబుతూ తానెంత గొప్పగా ఆస్వాదించాడో పేరు పేరునా గుర్తు పెట్టుకుని మరీ ట్యాగ్ చేశాడు.
ఇది ఫ్లాప్ అవుతుందని పది రోజుల క్రితం వరకు బలంగా నమ్మిన కొన్ని వర్గాలకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. యాంటీ పాకిస్థాన్ అంటూ, అబద్దాలు చూపించారంటూ మసిపూసి మారేడుకాయలాగా నెగటివ్ గా ఏదో రుద్దాలని చూశారు కానీ దాన్ని తట్టుకుని మరీ దురంధర్ స్ట్రాంగ్ గా నిలిచాడు. ట్విస్ట్ ఏంటంటే మార్చి 19 విడుదల కాబోయే దురంధర్ 2 కోసం డిమాండ్ పెరుగుతోంది. ఇది గమనించే అజయ్ దేవగన్ తన ధమాల్ 4 వాయిదా వేసుకున్నాడని ముంబై టాక్. ఊహించని విధంగా చాలా మందికి నిద్రలేని రాత్రులు మిగిల్చిన దురంధర్ ఫైనల్ రన్ లోపు ఇంకా ఏమేం సంచలనాలు చేస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates