మహానటి ఆఫర్లు రాకపోవడం ఏంటి?

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ రూపొందించిన ‘మహానటి’ సినిమాలో లీడ్ రోల్ కోసం కీర్తి సురేష్‌ను ఎంచుకుంటున్నట్లు తొలిసారి వార్త బయటికి వచ్చినపుడు చాలామంది వ్యతిరేకించారు. నిత్యా మీనన్ లాంటి పెర్ఫామర్ అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అన్న అభిప్రాయం సర్వత్రా వినిపించింది. అప్పటిదాకా నటిగా కీర్తికి అంత మంచి పేరు లేకపోవడం.. లుక్స్‌లోనూ సావిత్రికి దగ్గరగా లేకపోవడంతో నాగి నిర్ణయం పట్ల వ్యతిరేకత వచ్చింది. 

కానీ తన మీద నెలకొన్న సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సావిత్రి పాత్రను అద్భుతంగా పోషించి.. అందరి మన్ననలు పొందింది కీర్తి. ఆ సినిమాతో ఆమెను జనం చూసే కోణమే మారిపోయింది. ఈ సినిమా బహు భాషల్లో విజయవంతమై కీర్తికి ఎక్కడ లేని పేరు తీసుకొచ్చింది. ఐతే ‘మహానటి’ అంత పెద్ద హిట్టయినప్పటికీ.. తర్వాతి ఆరు నెలల పాటు కీర్తికి ఒక్కటంటే ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాలేదట. 

ఈ విషయాన్ని స్వయంగా కీర్తినే తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘మహానటి’ రిలీజ్ తర్వాత ఆరు నెలల పాటు ఎవ్వరూ కొత్త కథతో తనను సంప్రదించలేదని ఆమె వెల్లడించింది. ఐతే ఇందుకు తానేమీ ఫీల్ కాలేదని కీర్తి చెప్పింది. అంతకుముందు తన దగ్గరికి మామూలు కథలు, పాత్రలే వచ్చేవని.. ‘మహానటి’ చూశాక తన పాత్ర యునీక్‌గా, కంటెంట్ ఉన్నది అయి ఉండాలని.. రచయితలు, దర్శకులు ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెడుతున్నారని అర్థం చేసుకుని.. కొంత కాలం ఎదురు చూశానని కీర్తి చెప్పింది. 

‘మహానటి’ తర్వాత కీర్తి ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమె తన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నప్పటికీ.. చాలా వరకు తన సినిమాలు నిరాశపరిచాయి. ‘దసరా’ మినహాయిస్తే ఆమెకు చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఈ వారం ఆమె నుంచి ‘రివాల్వర్ రీటా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ రాబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ క్రైమ్ థ్రిల్లర్ రిలీజవుతుంది.