ప్రేక్షకులకు మనసైతే కనక వర్షమే

రాజు వెడ్స్ రాంబాయిలో ఒక పాటుంది. నీ మీద నాకు మనసాయెనే అంటూ హీరోయిన్ ని ఉద్దేశించి హీరో పాడతాడు. ఇది ఇప్పుడీ సినిమా ఫలితానికి కూడా సరిగ్గా అన్వయించుకోవచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా తక్కువ హైప్ తో రిలీజైన ఈ మూవీ కేవలం మూడు రోజులకే ఏడు కోట్ల గ్రాస్ దాటేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. మొదటిరోజు కన్నా శని ఆదివారాల కలెక్షన్లు ఎక్కువగా ఉండటం ఊహించని పరిణామం. తొమ్మిదికి పైగా సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ రాంబాయి రాజుల ప్రేమకథ ఇంతగా ఆడియన్స్ కి కనెక్ట్ కావడం చూస్తే ప్రేక్షకులకు మనసైతే కనకవర్షం ఖాయమే అని అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా నైజామ్ లో రాజు వెడ్స్ రాంబాయి దూకుడు మాములుగా లేదు. హైదరాబాద్ ఒకటే కాదు కరీంనగర్, ఆదిలాబాద్ లాంటి చోట్ల కూడా వసూళ్లు పెద్ద ఎత్తున ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్స్. ఆంధ్రప్రదేశ్ లో ఇంత స్పీడ్ లేనప్పటికీ మెయిన్ సెంటర్లలో చెప్పుకోదగ్గ నెంబర్లు నమోదవుతున్నాయి. గతంలో బలగంకు ఏపీలో ఎదురైన నేటివిటీ సమస్య ఇప్పుడీ రాంబాయికు కూడా వచ్చినట్టు కనిపిస్తోంది. బ్రేక్ ఈవెన్ రెండో రోజే దాటేయడంతో నిర్మాతలు లాభాల్లోకి వెళ్లిపోయారు. రేపు విజయ్ దేవరకొండ గెస్టుగా సక్సెస్ మీట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. లిటిల్ హార్ట్స్ కి ఇదే స్ట్రాటజీ వాడిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

ట్రాజెడీ క్లైమాక్స్, హెవీ ఎమోషన్స్ ఉన్నప్పటికి రాజు వెడ్స్ రాంబాయి ఇంత స్పందన దక్కించుకోవడం విశేషమే. ఈ మధ్య కాలంలో ఇంత ఇంటెన్స్ ఉన్న లవ్ స్టోరీ రాకపోవడం ప్లస్ అయ్యింది. అలాని ఎక్స్ ట్రాడినరి, నెవర్ బిఫోర్ లాంటి పదాలను దీనికి అన్వయించలేం కానీ ఉన్నంతలో దర్శకుడు సాయిలు కంపాటి తన ఛాలెంజ్ అయితే నిలబెట్టుకున్నాడు. ఇక అసలైన సవాల్ ఇవాళ నుంచి ఉంది. ఆక్యుపెన్సీలు ఏ మేరకు డ్రాప్ అవుతాయనేది చూడాలి. కనీసం యాభై శాతం హోల్డ్ చేసుకున్నా చాలు అంకెలు మరింత మెరుగవుతాయి. ఆంధ్రా కింగ్ తాలూకా వచ్చేలోగా వీలైనంత రాబట్టేయాలి.