కంటెంట్ మాట్లాడాలి… కాంట్రావర్సీలు కాదు

సినిమా మీద నమ్మకంతోనో లేదా బజ్ రావాలనే ఉద్దేశంతోనో హీరోలు దర్శకులు అప్పుడప్పుడు వివాదాస్పద స్టేట్ మెంట్లు ఇవ్వడం తరచు జరుగుతూనే ఉంది. ఆ మధ్య మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అంత అనుభవమున్న రాజేంద్రప్రసాద్ సైతం మూవీ చూశాక మీరు షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతానని శపథం చేశారు. పెద్దాయన కాబట్టి జనాలు లైట్ తీసుకున్నారు కానీ అదే ఎవరైనా అప్ కమింగ్ హీరో ఇలా మాట్లాడి ఉంటే సోషల్ మీడియా ట్రోలింగ్ ఒక స్థాయిలో ఉండేది. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడు సాయిలు కంపాటి నెగటివ్ టాక్ వస్తే అమీర్ పేట్ లో అర్ధనగ్నంగా తిరుగుతానని సవాల్ చేశాడు.

నిజానికి ఇలాంటి స్టేట్ మెంట్స్ వల్ల జరిగే మేలు కన్నా ముప్పే ఎక్కువ. కంటెంట్ మాట్లాడాలి. జనాలు చెప్పుకోవాలి. రివ్యూలు బాగా రావాలి. అప్పుడు ఎవరు ఆగమన్నా ఆగదు. అనుష్క లాంటి స్టార్ నటించిన ఘాటీతో పోటీ పెట్టుకుని లిటిల్ హార్ట్స్ గెలవడం మర్చిపోతే ఎలా. మిత్రమండలి ఆడకపోతే నెక్స్ట్ నా సినిమా చూడొద్దంటూ నాని రేంజ్ లో ఛాలెంజ్ చేసిన ప్రియదర్శి ఆ తర్వాత అలా అనకుండా ఉండాల్సిందని ఒప్పుకున్నాడు, ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు చివరిసారి కాబోదు. డెబ్యూ డైరెక్టర్లు ఎగ్జైట్ మెంట్ లో ఇలాంటి బిల్డప్పులు ఇవ్వడం వల్ల లేనిపోని నెగటివిటిని ఆహ్వానించినట్టు అవుతుంది.

ఇంకో ఇరవై ముప్పై గంటల్లో షోలు పడుతున్నప్పుడు ఇలా స్లిప్ అవ్వడం కరెక్ట్ కాదు. ఫస్ట్ షోకే తెలుగు రాష్ట్రాల థియేటర్లన్నీ హౌస్ ఫుల్ కావుగా. బాగుందనే టాక్ వస్తే సాయంత్రం ఆటకే టికెట్లు దొరకనంత ప్రేమ మన తెలుగు ఆడియన్స్ ఎలాగూ చూపిస్తారు. అది మర్చిపోయి నేను దుస్తులు విప్పుతా, ఫలానా సెంటర్లో తిరుగుతా అంటే ఎవరికి నష్టం. కావాలంటే రేపు హిట్టయ్యాక అప్పుడు కాలర్ ఎగరేయొచ్చు. రాజమౌళి లాంటి వాళ్ళు సైతం తమ తెరంగేట్రం టైంలో తొడలు కొట్టి సవాళ్లు విసరలేదు. తమ పని తాము చేసుకున్నారు. బ్లాక్ బస్టర్లు ఇవ్వడం ద్వారా తమ ప్రతిభను ఋజువు చేసుకుని ఈ స్థాయికి వచ్చారు.