రాజమౌళి 50 రోజులు యాక్షన్ ఎపిసోడ్ చేశాడంటే..

రాజమౌళి సినిమాలంటే యాక్షన్ ప్రియులకు పండగే. మాస్ ప్రేక్షకులు ఉర్రూతలూగేలా యాక్షన్ ఘట్టాల్ని తీర్చిదిద్దడంలో జక్కన్న నైపుణ్యమే వేరు. ‘సింహాద్రి’ దగ్గర్నుంచి ఆ ఎపిసోడ్లను తీర్చిదిద్దడంలో జక్కన్న ప్రతిభను చూస్తూనే ఉన్నాం. ఇక ‘బాహుబలి’కి వచ్చేసరికి ఆ ఘట్టాలు మరో స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులు సైతం మైమరిచిపోయేలా ఆ ఘట్టాలను తీర్చిదిద్దాడు.

ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లోనూ యాక్షన్ విందు మామూలుగా ఉండదనే అంచనాలున్నాయి. ఎందుకంటే ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్, మరోవైపు రామ్ చరణ్ లాంటి పెద్ద మాస్ హీరోలుండగా హీరో ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలకు కొదవేముంటుంది? తనపై ఎన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని మించి వినోదాన్ని అందించడం జక్కన్నకే సాధ్యమైన విద్య.

‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ ప్రేక్షకుల అంచనాలు అందుకుంటాడని రామరాజు, భీమ్ టీజర్లు చూస్తే అర్థమైంది. వాటిలో యాక్షన్ కళ స్పష్టంగా కనిపించింది. కాగా కరోనా విరామం తర్వాత జక్కన్న అక్టోబరులో చిత్రీకరణ పున:ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి తాజాగా షెడ్యూల్ ముగిసేవరకు పూర్తిగా ఒక యాక్షన్ ఎపిసోడ్‌కే కేటాయించాడట రాజమౌళి. 50 రోజుల పాటు పూర్తిగా రాత్రుల్లోనే చిత్రీకరణ జరిగింది. సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని ఈ యాక్షన్ ఘట్టం గురించి యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

విపరీతమైన చలిలో, వర్షంలో ఇబ్బంది పడుతూనే యూనిట్ సభ్యులు ఈ ఘట్టాన్ని పూర్తి చేశారు. రాత్రి పూట 50 రోజుల పాటు చిత్రీకరించిన ఎపిసోడ్ అంటే అది మామూలుగా ఉండదని అభిమానులు ఇప్పట్నుంచే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే తర్వాతి షెడ్యూల్ మొదలు పెట్టనుంది ఆర్ఆర్ఆర్ టీం. ఇందులో అజయ్ దేవగణ్ కూడా పాల్గొంటాడని తెలుస్తోంది.