నిన్నే పెళ్లాడతా జోడి… మరోసారి?

అక్కినేని నాగార్జున అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని స్పెషల్ మూవీ నిన్నే పెళ్లాడతా. కృష్ణవంశీ దర్శకత్వంలో 1996లో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కమర్షియల్ సినిమాల రికార్డులు బద్దలు కొట్టడం గురించి మీడియాలో కథలు కథలుగా వచ్చేవి. అప్పటికి అయిదు సంవత్సరాల క్రితమే కూలి నెంబర్ వన్ తో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ టబుకి అతి పెద్ద బ్రేక్ ఇచ్చిన చిత్రం నిన్నే పెళ్లాడతా. ఇప్పటికీ ఇందులో ఉండే కామెడీ, కుటుంబ అంశాలు, సందీప్ చౌతా పాటలు ఎవర్ గ్రీన్ అనిపిస్తాయి. ఇక నాగార్జున, టబు జోడి ఎంత క్యూట్ గా ఉండేదో అంతే హాట్ ఫేవరెట్ గా యూత్ లో నిలిచిపోయింది.

టబు నిన్నే పెళ్లాడతాలో చేయకముందు సిసింద్రీలో స్పెషల్ సాంగ్ చేసింది. అది కూడా నాగ్ కోసమే. తర్వాత ఈ కాంబో ఒక్కసారి మాత్రమే సాధ్యమయ్యింది. ఆవిడా మా ఆవిడే యావరేజ్ ఫలితం అందుకున్నాక మళ్ళీ ఈ కలయిక తెరమీద కనిపించలేదు. టబు బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి – పాండురంగడు, చిరంజీవితో అందరివాడు, రవితేజ షాక్ లో సపోర్టింగ్ రోల్ చేసింది కానీ ఆపై పూర్తిగా హిందీకె పరిమితమయ్యింది. అల వైకుంఠపురములో కోసం మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు విజయ్ సేతుపతి – పూరి జగన్నాథ్ మూవీలో మరో ముఖ్యమైన పాత్ర చేస్తోంది. ఇదంతా టబుకి సంబంధించిన ప్రస్తుత ట్రాక్ రికార్డు.

ఇంత కాలం తర్వాత నిన్నే పెళ్లాడతా జోడి తెరమీద కనిపించబోతున్నారని వినికిడి. ఆర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న నాగర్ణున వందో సినిమాలో టబుని ఒక కీలకమైన క్యారెక్టర్ కోసం తీసుకున్నారట. హీరోయిన్ గా కాదులెండి. ప్రాధాన్యం దృష్ట్యా నాగ్ అడగ్గానే ఒప్పుకుందని ఇన్ సైడ్ టాక్. ఇంకా అఫీషియల్ గా వెల్లడించలేదు కానీ త్వరలోనే ప్రకటన రావొచ్చు. సైలెంట్ గా పూజా కార్యక్రమాలతో కింగ్ 100 మొదలుపెట్టిన నాగ్ షూటింగ్ కూడా అంతే గుంభనంగా చేసేలా ఉన్నారు. కేవలం ఒక్క సినిమా అనుభవమున్న తమిళ దర్శకుడిని నమ్మకం చూస్తుంటే కంటెంట్ ఏదో సాలిడ్ గా రాసుకున్నట్టున్నారు.